Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

చిత్తూరు జిల్లాలో. నకిలీ నోట్ల మోసం. కేసులో పోలీసుల పాత్ర

అమరావతి, 17 మే (హి.స.)

: చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన నకిలీ నోట్ల మోసం కేసులో పోలీసుల పాత్ర బయటపడింది. గంగధర నెల్లూరు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఖాకీలే దొంగలుగా మారి వ్యాపారులను మోసం చేసిన విషయం వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తమిళనాడుకు చెందిన కొందరు వ్యాపారులను నిందితులు నమ్మించి గంగధర నెల్లూరుకు పిలిపించారు. రూ.10 లక్షల అసలు నోట్లకు బదులుగా రూ.1 కోటి నకిలీ నోట్లు ఇస్తామని ఆశ చూపించి వారిని ఉచ్చులోకి దించారు. అనంతరం బెదిరింపులకు పాల్పడి వారి వద్ద ఉన్న రూ.10 లక్షలను దోచుకున్నట్లు వెల్లడైంది.

ఈ దోపిడీ ముఠాలో లోకనాథం అనే ట్రాఫిక్ ఏఎస్సైతో పాటు రవి అనే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. వీరితో పాటు మరికొందరు సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాట్టుకండిగ గ్రామం వద్ద నిందితులను గంగాధర నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. మొదట కొబ్బరికాయల వ్యాపారం పేరుతో వచ్చి తమను దోచుకున్నారని బాధితులు కథనం చెప్పినప్పటికీ, లోతుగా విచారణ జరపగా అసలు విషయం బయటపడింది. విచారణలో నకిలీ నోట్ల మార్పిడి దందా నేపథ్యంలోనే ఈ దోపిడీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరికొందరి పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఖాకీలే నేరంలో పాల్గొనడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu