
హైదరాబాద్, 07 జూలై (హి.స.)కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Telangana CM Revanth Reddy) సచివాలయంలో ఈరోజు(మంగళవారం) ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. డిజిటల్ గవర్నెన్స్ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసి, అవసరమైన చట్టాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పరిపాలన వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేస్తూ ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని సీఎం సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందించేందుకు వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. వివిధ విభాగాల్లోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలను డిజిటలైజ్ చేయాలని నిర్దేశించారు. డిజిటల్ గవర్నెన్స్పై పూర్తిస్థాయి కసరత్తు చేసేందుకు ఒక కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. 100 రోజుల్లో ఆ కమిటీకి నివేదిక సమర్పించి ఒక కొలిక్కి తీసుకురాలని ఆదేశించారు. ప్రభుత్వం చెల్లింపులు చేసినా సమయానికి ఉద్యోగులకు జీతాలు చెల్లించని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్

