
బైరెడ్డిపల్లి (చిత్తూరు), 02 జూన్ (హి.స.) : పలమనేరు - కుప్పం ఎన్హెచ్-4 జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పలమనేరు ఆర్డీవో భవాని హామీ ఇచ్చారు.
బైరెడ్డిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్హెచ్-4 రహదారి బాధిత రైతులతో సమావేశమైన ఆమె, రైతుల సమస్యలు, డిమాండ్లను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
రహదారి విస్తరణ కోసం సేకరించిన భూములకు కొంతమంది రైతులకు స్క్వేర్ మీటరుకు కేవలం రూ.197 మాత్రమే పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న మార్గదర్శకాల ప్రకారం స్క్వేర్ మీటరుకు రూ.1,208 చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల వినతులను శ్రద్ధగా విన్న ఆర్డీవో భవాని, సంబంధిత శాఖల అధికారులతో సమగ్రంగా చర్చించి ఒకటి రెండు రోజుల్లో తగిన నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రైతులకు న్యాయం జరిగే విధంగా అన్ని అంశాలను పరిశీలిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని రాజు కాలువలు, వంక పోరంబోకులు ఆక్రమణకు గురవుతున్న అంశాన్ని కూడా రైతులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. సీఐటీయూ ఆధ్వర్యంలో గతంలో ఫిర్యాదులు అందజేసినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు కనిపించలేదని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆర్డీవో, గ్రీవెన్స్ కార్యక్రమం సందర్భంగా సంబంధిత అంశాన్ని తహసీల్దార్కు తెలియజేశామని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని చెప్పారు. అవసరమైతే తాను స్వయంగా గ్రామాలకు వచ్చి పరిస్థితిని పరిశీలించి ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. పచ్చని చెడులు, రాజు కాలువలు, వంక పోరంబోకులు ప్రజల ఆస్తులని, వాటిని కాపాడటం అధికారుల బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

