Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం!

ఢిల్లీ, 21 మే (హి.స.)

ఢిల్లీ నుంచి బెంగళూరు వచ్చిన ఎయిరిండియా విమానానికి ల్యాండింగ్ సమయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. రన్వేపై దిగుతున్న తరుణంలో దాని వెనుక భాగం (తోక) భూమిని బలంగా తాకింది.

అయితే పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు.

గాల్లో మారిన బ్యాలెన్స్

ఢిల్లీ నుంచి బెంగళూరుకు 179 మంది ప్రయాణికులతో వచ్చిన ఏఐ2651 ఎయిర్ బస్ విమానం ల్యాండింగ్ కావడానికి సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో రన్వేపై నుంచి మరో పెద్ద విమానం టేకాఫ్ కావడంతో గాల్లో తీవ్రమైన గాలి అలల ఉద్ధృతి (విండ్ టర్బులెన్స్) ఏర్పడింది. దీనివల్ల విమానం బ్యాలెన్స్ తప్పడంతో పైలట్లు ల్యాండింగ్ను తాత్కాలికంగా ఆపి మళ్లీ విమానాన్ని పైకి లేపేందుకు ప్రయత్నించారు. ఈ ప్రక్రియలోనే విమానం తోక భాగం రన్వేను గీసుకుంటూ వెళ్లింది.

విమానం నిలిపివేత

ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. ఎయిరిండియా సంస్థ ఈ ఎయిర్బస్ ఏ321 విమానాన్ని తదుపరి తనిఖీల కోసం ఎయిర్పోర్టులోనే నిలిపివేసింది. దీనివల్ల బెంగళూరు నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లాల్సిన ఏఐ2652 ఫ్లైట్ను క్యాన్సిల్ చేశారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు.

రంగంలోకి డీజీసీఏ

ఈ ప్రమాదంపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది. నిబంధనల ప్రకారం దర్యాప్తు పూర్తయ్యే వరకు సదరు పైలట్లను విధుల నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఎయిరిండియా గ్రౌండ్ టీమ్స్ ప్రయాణికులకు అవసరమైన సాయాన్ని అందిస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu