
హైదరాబాద్, 21 మే (హి.స.)
తెలంగాణలోని కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో శ్రామికుల కనీస వేతనాలను (Minimum Wages) పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
పెంచిన ఈ కొత్త వేతనాలు వచ్చే జూన్ నుంచే అమల్లోకి రానున్నాయని స్పష్టం చేశారు. వేతనాల సవరణ కోసం రాష్ట్రాన్ని ప్రభుత్వం మూడు జోన్లుగా విభజించింది. ఇందులో జోన్-1 కింద మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్-2 కింద మున్సిపాలిటీలు, జోన్-3 కింద గ్రామీణ ప్రాంతాలను చేర్చినట్లు సీఎం వెల్లడించారు. కార్మికుల కనీస వేతనాలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించామని, కార్మికులను నాలుగు విభాగాలుగా చేసి కనీస వేతనాలు నిర్ణయించామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
ప్రధాన నగరాలు, కార్పొరేషన్లు ఉన్న జోన్-1 పరిధిలో కార్మికుల నైపుణ్యత ఆధారంగా వేతనాలను ప్రభుత్వం సవరించింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత పదేళ్ల కేసీఆర్ హయాంలో కార్మికుల కనీస వేతనాలను నిర్ణయించడంలో ఘోరమైన నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. ఫలితంగా రాష్ట్రంలో దాదాపు 1.11 కోట్ల మంది కార్మికులు పదేళ్ల పాటు తీవ్రంగా నష్టపోయారని
ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అందుకే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అలాగే, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికుల రక్షణ, సంక్షేమం కోసం త్వరలోనే ఒక అద్భుతమైన 'గల్ఫ్ పాలసీ'ని తీసుకురాబోతున్నామని, ప్రస్తుతం గల్ఫ్ వెళ్లేవారి బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటోందని భరోసా ఇచ్చారు.
కేవలం డిగ్రీలు పూర్తి చేసి, ఉద్యోగం లేదా ఉపాధి రాని చదువులతో ఎలాంటి ప్రయోజనం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Al) సాంకేతికతను దృష్టిలో పెట్టుకుని నైపుణ్య ఆధారిత చదువులపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర యువత తమ స్కిల్స్ పెంచుకుంటేనే భద్రత మార్కెట్లో ఉద్యోగ ఉంటుందన్నారు. ఏఐ ఎంత వేగంగా విస్తరించినప్పటికీ.. శారీరక శ్రమతో కూడిన 'బ్లూ కాలర్' ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ మార్కెట్లో చైనా, జపాన్, సౌత్ కొరియా దేశాల ఉత్పత్తులకు భారతదేశం, ముఖ్యంగా తెలంగాణ ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

