
హైదరాబాద్, 05 మే (హి.స.)కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి సాధించిన అసాధారణ విజయంతో తెలంగాణలో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం రెట్టింపయింది.
సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్బాబు, ఇతర నేతలు కేరళ వెళ్లి పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరు పర్యటించిన పలు చోట్ల కాంగ్రెస్ మంచి విజయాలు సాధించింది. రేవంత్రెడ్డిని కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ నియమించడంతో స్వయంగా వెళ్లి కోవలం, మావెలిక్కర, పథానపురం, నేమం, కొచ్చిన్, తిరువనంతపురం తదితర ప్రాంతాల్లో రోడ్ షోలు, ప్రచార సభల్లో పాల్గొని కాంగ్రెస్ను గెలిపించాలని ప్రజలను కోరారు.
యూడీఎఫ్ మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలోనూ రేవంత్రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ.. కేరళనూ ప్రగతి పథంలోకి తీసుకెళ్లడానికి పార్టీని గెలిపించాలని తాము చేసిన ప్రచారానికి అక్కడి ప్రజలు స్పందించి మద్దతు పలికారని రాష్ట్ర నేతలు తెలిపారు. కేరళలో స్ఫూర్తిదాయకమైన విజయానికి కారకులైన నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక అభినందనలని సీఎం రేవంత్రెడ్డి సోమవారం ఎక్స్లో తెలిపారు. ఈ చరిత్రాత్మక విజయానికి నేతృత్వం వహించిన పార్టీ నాయకత్వానికి, ముఖ్యంగా రాహుల్గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ, పార్టీ నాయకులు, కేడర్కు అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. 'కేరళ, తెలంగాణ గొప్ప రాష్ట్రాలు. ఇరు రాష్ట్రాల ప్రజలు విలువలు, ప్రజాస్వామ్యస్ఫూర్తి గలవారు. అభివృద్ధిని విశ్వసిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గొప్ప భవిష్యత్తు కోసం కేరళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నాపై ప్రేమ కురిపించిన అక్కడి ప్రజలకు ధన్యవాదాలు' అని సీఎం తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్

