Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

లోక్ సభ సీట్లపై నారా లోకేష్ వర్సెస్ షర్మిల

అమరావతి, 22 మే (హి.స.)

లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై టీడీపీ నేత నారా లోకేష్ లేనిపోని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు.

జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసి, మెరుగైన మానవాభివృద్ధి సూచికలను సాధించిన దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా శిక్షించకూడదన్నదే తమ పార్టీ స్పష్టమైన వైఖరి అని ఆమె పునరుద్ఘాటించారు. కేవలం లోక్సభ స్థానాల సంఖ్యను పెంచడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు రక్షణ లభించదని, పార్లమెంటులో వాటి సాపేక్ష ప్రాతినిధ్యం, రాజకీయ పలుకుబడి తగ్గకుండా చూడటమే అసలైన సవాల్ అని ఆమె అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత పి.చిదంబరం ట్వీట్ కు బదులిస్తూ నారా లోకేష్ చేసిన పోస్ట్ పై షర్మిల ఈ విధంగా స్పందించారు.

ఈ అంశంపై శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. దక్షిణాది రాష్ట్రాల గొంతుకను తగ్గించే ఎలాంటి పునర్విభజన ప్రక్రియనైనా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. దీనిపై తిరుగులేని రాజ్యాంగ హామీ ఉండాలని మేం డిమాండ్ చేశాం. ఆర్టికల్ 81 ప్రకారం చూస్తే, ఆంధ్రప్రదేశ్కు సంఖ్యాపరంగా సీట్లు పెరిగినా, అధిక జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్య బలం, నిర్ణయాధికారం తగ్గిపోయే ప్రమాదం ఉంది, అని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ సమస్యకు ప్రత్యామ్నాయాలను అన్వేషించడంలో విఫలమైందని ఆమె ఆరోపించారు. రాజ్యాంగ నిపుణులు సూచించినట్లుగా స్థానిక సంస్థలను బలోపేతం చేయడం, రాష్ట్రాలకు, స్థానిక సంస్థలకు మరిన్ని ఆర్థిక, పరిపాలనా అధికారాలు ఇవ్వడం, వికేంద్రీకరణను ప్రోత్సహించడం వంటి మార్గాలను కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. కేవలం లోక్సభ సీట్లను పెంచడమే ఏకైక పరిష్కారంగా చూపింది, అని ఆమె పేర్కొన్నారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో పార్లమెంటు సమావేశాల రోజుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని, ఇప్పటికే జాతీయ చర్చల్లో దక్షిణాది రాష్ట్రాల వాణిని అణచివేస్తున్నారని షర్మిల విమర్శించారు. సమాఖ్య సమతౌల్యాన్ని, పార్లమెంటరీ పనితీరును కాపాడకుండా సభను విస్తరిస్తే, వ్యక్తిగత ప్రాతినిధ్యం, అర్థవంతమైన చర్చ మరింత బలహీనపడతాయి. దక్షిణాది రాజకీయ ప్రాబల్యాన్ని శాశ్వతంగా కాపాడతామని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎప్పుడూ స్పష్టమైన రాజ్యాంగ హామీ ఇవ్వలేదు. ఒకప్పుడు సమాఖ్య స్ఫూర్తి కోసం, దక్షిణాది ప్రయోజనాల కోసం పోరాడిన టీడీపీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు, దక్షిణాదికి ఎలాంటి రక్షణలు కోరకుండా బీజేపీ అస్పష్ట వైఖరిని సమర్థించడం విడ్డూరంగా ఉంది, అని ఆమె అన్నారు. సమాఖ్య సమతౌల్యాన్ని, దక్షిణాది ప్రాతినిధ్యాన్ని, సహకార సమాఖ్య స్ఫూర్తిని కాపాడటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, మెరుగైన పాలన అందించిన రాష్ట్రాలను రాజకీయంగా శిక్షించే వ్యవస్థగా భారత ప్రజాస్వామ్యం మారకూడదని షర్మిల స్పష్టం చేశారు. ఈ మేరకు నారా లోకేష్ చేసిన ఓ ట్వీట్ ను ఆమె రీపోస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu