Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీట్ పేపర్ లీక్ కాలేదు.. కొన్ని ప్రశ్నలే బయటకొచ్చాయి: ఎన్టీఏ

నీట్ పేపర్ లీక్ కాలేదు.. కొన్ని ప్రశ్నలే బయటకొచ్చాయి: ఎన్టీఏ

ఢిల్లీ, 22 మే (హి.స.)నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ పూర్తిగా లీక్ కాలేదని, కేవలం కొన్ని ప్రశ్నలు మాత్రమే బయటకు వచ్చాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పష్టం చేసింది.

ఇటీవలి నీట్ వివాదంపై విచారణ జరుపుతున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు హాజరైన ఎన్టీఏ అధికారులు ఈ మేరకు వివరణ ఇచ్చారు. పరీక్షలో అక్రమాలు, అవకతవకలు జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ, దీనిని పూర్తిస్థాయి పేపర్ లీక్గా పరిగణించలేమని వారు కమిటీకి తెలిపారు.

మే 3న జరిగిన నీట్-యూజీ పరీక్షకు ముందు కొన్ని ప్రశ్నలు బయటకు వచ్చాయన్న ఆరోపణలతో తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ ఎన్టీఏ అధికారులను పిలిపించి వివరణ కోరింది. అవకతవకల విషయంలో తమది జీరో-టాలరెన్స్ విధానమని, అందుకే విద్యార్థుల్లో విశ్వాసం దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే పరీక్షను రద్దు చేయాల్సి వచ్చిందని ఎన్టీఏ అధికారులు పేర్కొన్నారు. తమ వ్యవస్థ నుంచి పేపర్ లీక్ కాలేదని వారు పునరుద్ఘాటించారు. అయితే, సీబీఐ దర్యాప్తు పూర్తయ్యాకే దీనిపై పూర్తి బాధ్యులెవరనేది తేలుతుందని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషి, ఎన్టీఏ చీఫ్ అభిషేక్ సింగ్ కమిటీకి తెలిపారు.

ఈ సమావేశంలో ఎంపీలు అధికారులను పలు ప్రశ్నలతో నిలదీశారు. వ్యవస్థలోని లోపాలను గుర్తించి సరిదిద్దాలని, ఎన్టీఏలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సూచించారు. కొందరు ఎంపీలు, భవిష్యత్తులో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సెట్ చొప్పున 10 రకాల ప్రశ్నపత్రాలను సిద్ధం చేయాలని సలహా ఇచ్చారు. ఈ సమావేశం సానుకూలంగా జరిగిందని, ఎంపీల నుంచి మంచి సూచనలు వచ్చాయని కమిటీ చైర్పర్సన్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు.

ఈ కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటివరకు రాజస్థాన్, హరియాణా, మహారాష్ట్రలలో 9 మందిని అరెస్ట్ చేసింది. పుణెకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణి, బొటనీ టీచర్ మనీషా గురునాథ్ మాండరేలను అరెస్ట్ చేయడం దర్యాప్తులో కీలక పురోగతిగా భావిస్తున్నారు. ఎన్టీఏ తరఫున పరీక్షల ప్రక్రియలో వీరు నిపుణులుగా పనిచేసినట్టు తేలింది.

ఇదిలా ఉండగా.. రద్దు చేసిన నీట్-యూజీ పరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించనున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం గానీ, అదనపు ఫీజు చెల్లించడం గానీ అవసరం లేదని, పాత రిజిస్ట్రేషన్లే చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. పరీక్షకు ముందు కొత్త అడ్మిట్ కార్డులు జారీ చేయనున్నారు. ఈసారి అదనపు భద్రతా చర్యలు, కఠినమైన పర్యవేక్షణ మధ్య పరీక్షను నిర్వహిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu