అమరావతి, 22 మే (హి.స.)
పౌల్ట్రీ పరిశ్రమకు వేసవి దెబ్బ తగిలింది. ఎండ వేడికి తట్టుకోలేక ప్రతిరోజు లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు రోజులుగా సుమారు పది లక్షల కోళ్లు మృత్యువాత పడినట్లు పౌల్ర్టీ రైతులు చెబుతున్నారు.
అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా భారీ సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా లేయర్ ఫారాల్లో వేడి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. గాలి వెళ్లే మార్గాలు లేకపోవడం, తాగునీటి కొరత, విద్యుత్ అంతరాయం కూడా కోళ్ల మరణాలకు కారణంగా భావిస్తున్నారు. వేసవిలో కోళ్లు బరువు తగ్గడం, మేత తినకపోవడం, గుడ్ల ఉత్పత్తి తగ్గడం తదితర కారణాలతో పరిశ్రమ నష్టాల బారిన పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కోళ్ల ఫారాల్లో సుమారు కోటీ 20 లక్షల కోళ్లు ఉన్నాయి. వాటిలో 90 లక్షల వరకు గుడ్డు ఉత్పత్తి అవుతుంది. ఎక్కువగా గుడ్లు ఉత్పత్తి చేసే కోళ్లు చనిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రత ప్రభావం బర్డ్ఫ్లూ కంటె ఎక్కువగా నష్టం కలిగిస్తోందని వాపోతున్నారు. చనిపోయిన కోళ్లను గొయ్యితీసి పాతిపెడుతున్నారు. కోళ్లకు బీమా చేయించుకునే పరిస్థితి ఉండేది. బీమా చేసే కంపెనీల ఆంక్షలు, భారీ ప్రీమియంతో రైతులు ఆసక్తి చూపడంలేదు. కోట్లు పెట్టుబడి పెట్టి బీమా చేయించినా అవసరమైనపుడు బీమా కంపెనీలు పలు కొర్రీలతో క్లెయిమ్ ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
