Dailyhunt
ప్రభుత్వ భూమిలో నమాజ్ హక్కు కాదు.. సామూహిక ప్రార్థనలపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వ భూమిలో నమాజ్ హక్కు కాదు.. సామూహిక ప్రార్థనలపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

సంభాల్, 02 మే (హి.స.)ప్రభుత్వ భూములను నమాజ్ లేదా ఇతర పెద్ద ఎత్తున మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి హక్కుగా వినియోగించుకోలేరని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.

రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ హక్కుకు ప్రజాశాంతి, నైతికత, ఇతరుల హక్కులు వంటి పరిమితులు వర్తిస్తాయని ధర్మాసనం తేల్చిచెప్పింది.

ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లా ఇకౌనా గ్రామంలోని ఓ స్థలంలో నమాజ్ చేసుకునేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన జస్టిస్ గరిమా ప్రసాద్, జస్టిస్ సరళ్ శ్రీవాస్తవతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అసీన్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. గిఫ్ట్ డీడ్ ద్వారా ఆ భూమి తనకే చెందిందని, అక్కడ ప్రార్థనలు చేసుకోకుండా అధికారులు అడ్డుకుంటున్నారని పిటిషనర్ వాదించారు.

అయితే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ వాదనను వ్యతిరేకించింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం అది ప్రజా అవసరాల కోసం కేటాయించిన 'ఆబాదీ భూమి' అని కోర్టుకు తెలిపింది. పిటిషనర్ చూపిన గిఫ్ట్ డీడ్లో భూమికి సంబంధించిన సరైన గుర్తింపు వివరాలు లేవని పేర్కొంది. గతంలో ఈద్ రోజున మాత్రమే అక్కడ ప్రార్థనలు జరిగేవని, దానికి ఎలాంటి ఆంక్షలు లేవని ప్రభుత్వం వివరించింది. అయితే, పిటిషనర్ కొత్తగా ఇతర గ్రామాల వారిని కూడా పిలిచి రోజూ సామూహిక ప్రార్థనలు మొదలుపెట్టాలని చూస్తున్నారని, ఇది స్థానికంగా సామాజిక సమతౌల్యతను దెబ్బతీస్తుందని ఆరోపించింది.

ఈ వాదనలను పరిశీలించిన ధర్మాసనం, ప్రజా శాంతికి విఘాతం కలిగే అవకాశం ఉందని భావిస్తే, ముందస్తు చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. పిటిషనర్ తన యాజమాన్యాన్ని నిరూపించడంలో విఫలమవడంతో పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. వ్యక్తిగత ప్రార్థనలకు, సామూహిక మతపరమైన కార్యక్రమాలకు మధ్య తేడా ఉంటుందని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu