
ఆదోని(కర్నూలు), 05 మే (హి.స.): కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు భారీగా పెరిగాయి. పదిహేను రోజుల్లో పత్తిధర క్వింటాకు రూ.800 పైగా ధర పెరిగింది.
ఇప్పటికే పత్తి సీజన్ ముగియడంతో అరకొర పత్తి రైతులు విక్రయానికి తీసుకొస్తుండడంతో వ్యాపారుల మధ్య పోటీ నెలకొనడంతో ధరలు పెరగడానికి కారణమైందని వ్యాపారులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లోనూ దూది ధరలు పెరి గాయని, దీంతో స్థానిక మార్కెట్ యార్డులో ధరలు పెరగడానికి మరో కారణమని తెలిపారు. ధరలు పెరగడంతో పత్తి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 758 క్వింటాల పత్తి విక్రయానికి రాగా.. గరిష్ఠ ధర రూ.9615, మధ్యస్థం రూ.9,300 కనిష్ఠం రూ.5,525 పలికింది. ప్రస్తుతం రాష్ట్రంలో పత్తి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. పత్తి వేసిన రైతులకు ఈ ధర పెరగడం ఆనందాన్నిస్తోంది. అయితే ఈ ఏడాది చాలామంది రైతులు ఎక్కువ మొత్తంలో పత్తిని సాగు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

