
రంగారెడ్డి, 05 మే (హి.స.)
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హార్డ్వేర్ పార్క్ (ఫేజ్-3)లో అధునాతన ఏరోస్పేస్ తయారీ రంగానికి మరింత ఊతమిచ్చేలా రూ.453 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఐటీపీ ఏరో - ఇండియా" ప్లాంట్కు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం భూమి పూజ నిర్వహించారు.
10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ప్లాంట్ ద్వారా విమాన ఇంజన్లలో వినియోగించే రిజిడ్ ట్యూబ్స్కు అవసరమైన ఎండ్-ఫిట్టింగ్స్, బ్రాకెట్లు వంటి కీలక భాగాలను తయారు చేయనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రిసిషన్ ఇంజనీరింగ్ ఆధారంగా ఈ యూనిట్ రూపుదిద్దుకోనుండటం తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి కీలకంగా భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ రాష్ట్రం ఏరోస్పేస్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో మరింత బలోపేతం కానుంది. శంషాబాద్ పరిసర ప్రాంతం ఇప్పటికే విమానయాన, హార్డ్వేర్, తయారీ రంగాలకు కేంద్రంగా ఎదుగుతున్న నేపథ్యంలో ఐటీపీ ఏరో ఇండియా ప్లాంట్ కీలక పెట్టుబడిగా నిలవనుంది.
ప్లాంట్ నిర్మాణం దశలవారీగా కొనసాగి 2027 నాటికి పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ ప్రారంభం కానున్నాయి. ప్రిసిషన్ ఇంజనీరింగ్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో తొలి దశలోనే 350 మంది హై-స్కిల్డ్ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రానున్న రోజుల్లో ఉద్యోగాల సంఖ్య 600కు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా స్థానికంగా నైపుణ్య ఆధారిత ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు, తెలంగాణను ప్రపంచ ఏరోస్పేస్ సరఫరా గొలుసులో మరింత బలంగా నిలబెట్టే దిశగా ఇది కీలక అడుగుగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

