
హైదరాబాద్, 01 జూన్ (హి.స.)
నాచారం ప్రధాన రహదారి పై
హబ్సిగూడ నుంచి నాచారం వైపు వెళ్లే మార్గంలో ఉన్న ఐఐసీటీ ఇన్స్టిట్యూట్, క్వార్టర్స్ మధ్య ఏర్పడిన బాటిల్నెక్ రోడ్డు సమస్య పరిష్కారానికి కీలక చర్యలు ప్రారంభమయ్యాయి.
హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం హెచ్ఎంటీ వరకు రహదారి ఇరుకుగా ఉండడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్య పై గత కొంతకాలంగా నిరంతరం కృషి చేస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రయత్నాల ఫలితంగా రోడ్డు విస్తరణకు మార్గం సుగమమవుతోంది. ఈ సందర్భంగా ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో సోమవారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమావేశమై రహదారి విస్తరణ అంశం పై చర్చించారు. ప్రస్తుతం ఉన్న రహదారికి ఇరువైపులా సుమారు 20 అడుగుల చొప్పున స్థలం ఇవ్వడానికి ఐఐసీటీ యాజమాన్యం సానుకూలంగా ఉన్నట్లు డైరెక్టర్ తెలిపారు.
అయితే, పెరుగుతున్న జనాభా, విద్యాసంస్థల వాహనాల రద్దీ, అలాగే చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారి మధ్య నుంచి తగిన వెడల్పుతో పూర్తి స్థాయి రోడ్డు విస్తరణ చేపట్టాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి డైరెక్టర్ను కోరారు. ఈ ప్రతిపాదన పై కేంద్ర కార్యాలయానికి సమగ్ర నివేదిక పంపించి తదుపరి చర్యలు చేపడతామని ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. రోడ్డు విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడంతో పాటు ప్రజల రాకపోకలు సులభతరం అవుతాయని, ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

