
హైదరాబాద్, 07 జూలై (హి.స.)
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలైన సమాజ్వాదీ పార్టీ (SP), కాంగ్రెస్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రతాప్గఢ్లో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. అయోధ్య రామాలయ విరాళాల లెక్కింపులో జరిగిన అక్రమాల ఆరోపణలను అడ్డం పెట్టుకుని హిందూ విశ్వాసాలను అవహేళన చేస్తున్న ప్రతిపక్షాలు, దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు పేరిట జరిగిన వేలాది హెక్టార్ల భూముల అక్రమ విక్రయాలపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. వక్ఫ్ భూముల వ్యవహారంలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ నాయకుల నోళ్లకు 'ఫెవికాల్' అంటుకుందా అని ఆయన ఎద్దేవా చేశారు.
రంగులు మార్చడంలో ప్రతిపక్ష నాయకులు ఊసరవెల్లిని మించిపోయారని, మరింత వేగంగా రంగులు మార్చే కొత్త జాతి ఒకటి పుట్టుకొచ్చింది అని చూసి బహుశా ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందేమో అంటూ సీఎం యోగి తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయోధ్య ఆలయ విరాళాల అక్రమాలపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అభ్యర్థన మేరకు తమ ప్రభుత్వం వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిందని, నిజానిజాలను నిగ్గుతేల్చి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ శ్రీరాముడు, శ్రీకృష్ణుడి ఉనికినే ప్రశ్నించిందని, సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం అయోధ్యలో రామభక్తులపై బుల్లెట్లు, లాఠీఛార్జీలు చేయించిందని అమిత్ షా పాత విషయాలను గుర్తు చేశారు. హిందూ దేవాలయాల పునరుద్ధరణకు ఉద్దేశించిన నిధులను స్మశానవాటికల ప్రహరీ గోడల నిర్మాణానికి మళ్లించారని, అక్రమ కసాయిఖానాలను ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు.
పేదలు, బలహీన వర్గాలకు చెందాల్సిన వక్ఫ్ భూములను అక్రమంగా విక్రయించడాన్ని గత ప్రభుత్వాలు చూస్తూ ఊరుకున్నాయని మండిపడ్డారు. దేశ ప్రజలు ఇకపై ప్రతిపక్షాల ద్వంద్వ విధానాలను నమ్మరని, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల రాజకీయ ఉచ్చులో పడబోరని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

