
హైదరాబాద్, 05 మే (హి.స.)ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ మదన్ భీంరావు లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ కోరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు కాళేశ్వరం బ్యారేజీలపై సీబీఐ విచారణకు పట్టుబట్టాలని, ఈ నెల 26 నుంచి భూముల మార్కెట్ విలువలను సవరించాలని, మదర్ డెయిరీని నేషనల్ డెయిరీ డెవల్పమెంట్ బోర్డుకు అప్పగించాలని, సబ్స్టేషన్ల వద్ద సోలార్ పవర్ప్లాంట్లు ఏర్పాటు చేయాలనే నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం తీర్మానాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్కుమార్తో కలిసి మీడియాకు వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణను వేగవంతం చేయాలని సీబీఐని కోరుతూ ప్రభుత్వం తరఫున కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆధునిక సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కూడా కేవలం ఇండియా బుల్ సంస్థకు మేలు చేయడానికే సబ్ క్రిటికల్ టెక్నాలజీతో తయారు చేసిన పరికరాలతో భద్రాద్రి పవర్ ప్లాంట్ కట్టారని పేర్కొన్నట్లు తెలిసింది. ఇక యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ఏకంగా బొగ్గు గనులకు 200 కిలోమీటర్ల దూరంలో జరిగిందని, వీటన్నింటికీ నాటి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణమని నివేదికలో వెల్లడించినట్లు సమాచారం. 2025 జనవరి 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికపై అడ్వకేట్ జనరల్తో న్యాయసలహా తీసుకొని సీబీఐ దర్యాప్తు కోరాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్

