Adilabad: ఆదివాసీల సమస్యలపై రాహుల్ గాంధీకి నివేదిక
ఆదిలాబాద్: ఆదివాసీ జాతీయ కో-ఆర్డినేటర్ కుసుం తాయి ఆలంను యువజన కాంగ్రెస్ జిల్లా సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ శ్రీకర్ గౌడ్ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సోనియా గాంధీ ఆదివాసుల సంక్షేమం కోసం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను గుర్తుచేశారు. మారుమూల ఆదివాసీ గ్రామాలకు అంబులెన్స్ సేవలు, మెరుగైన వైద్యం అందినప్పుడే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆమె స్పష్టం చేశారు.
బలమైన చట్టాలతో ఆదివాసులను రక్షించడంతో పాటు, నిరుపేదలకు కూడు, గూడు కల్పించడమే కాంగ్రెస్ ప్రధాన ధ్యేయమని ఆమె వెల్లడించారు. అలాగే, మారుమూల గూడాల స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రాహుల్ గాంధీకి నేరుగా నివేదిక సమర్పించనున్నట్లు కుసుం తాయి ఆలం తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

