Adilabad: కన్గుట్ట బాధితులకు అన్వేష్ రెడ్డి భరోసా.. రైతులకు పూర్తి పరిహారం!
Adilabad: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కన్గుట్ట గ్రామంలో జరిగిన ఘోర అగ్నిప్రమాద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి భరోసా ఇచ్చారు.
ఈ ప్రమాదంలో సుమారు 70 నుంచి 80 ఎకరాల్లో మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమవ్వగా, ఆయన స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతులను పరామర్శించారు. కళ్లముందే చేతికొచ్చిన పంట బూడిదైపోవడంతో రోదిస్తున్న రైతులను చూసి ఆయన చలించిపోయారు.
ఎండల తీవ్రత తో పాటు విద్యుత్ లైన్ల నిర్వహణలో ఉన్న కొంత నిర్లక్ష్యం కూడా ఈ ప్రమాదానికి కారణమని ఆయన పేర్కొన్నారు, గాలి వేగానికి మంటలు ఒక చేను నుండి మరో చేనుకు వ్యాపించడం వల్ల నష్టం తీవ్రత పెరిగిందని అన్నారు.
రైతులకు కేవలం నామమాత్రపు సాయం కాకుండా, వారు కోల్పోయిన పంట దిగుబడిని మరియు పెట్టుబడిని పరిగణనలోకి తీసుకొని పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో మాట్లాడి అధికారులను రంగంలోకి దించామని, ప్రతి రైతుకు జరిగిన నష్టాన్ని, అలాగే కాలిపోయిన పైపులు, మోటార్ల వివరాలను సైతం సేకరించి ఈరోజు మధ్యాహ్నం కల్లా నివేదిక అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వం రైతుల పక్షాన ఉందని, ప్రతి పైసా నష్టాన్ని అంచనా వేసి బాధితులకు తగిన న్యాయం చేస్తామని అన్వేష్ రెడ్డి స్పష్టం చేశారు.ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డా,, నరేష్ జాదవ్ బోథ్ కాంగ్రెస్ ఇంచార్జి ఆడే గజేందర్ గ్రామ రైతులు ఉన్నారు.

