Adilabad: ఉపాధి హామీ చట్టంపై ఆదిలాబాద్లో కూలీల గర్జన
ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో తెస్తున్న మార్పులకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ రూరల్ యాపలగూడ ప్రధాన రహదారిపై కూలీలు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు.
వీరికి మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మద్దతు తెలిపారు. ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్న నూతన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, పాత పద్ధతినే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. నిరసనతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
అదేవిధంగా ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ రహదారిపై నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పాత ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పని ప్రదేశాలలో కార్మికుల కోసం మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఉపాధి హామీ డబ్బులు 15 రోజుల్లోపు కార్మికులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

