Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Amaravati: పైప్‌లైన్ గ్యాస్‌పై ప్రభుత్వం ఫోకస్, పీఎన్జీ విస్తరణకు కార్యాచరణ వేగం

Amaravati: పైప్‌లైన్ గ్యాస్‌పై ప్రభుత్వం ఫోకస్, పీఎన్జీ విస్తరణకు కార్యాచరణ వేగం

hmtv 2 days ago

Amaravati: రాష్ట్రంలో వంటగ్యాస్ వినియోగంలో కొత్త మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా పైప్‌లైన్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వినియోగాన్ని ప్రజల్లో విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

ఈ దిశగా రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సచివాలయంలో ఉన్నతాధికారులు, గ్యాస్ సంస్థల ప్రతినిధులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీసీ జనార్థన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పీఎన్జీ సేవలను వేగంగా అందించేలా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

విస్తరణకు ప్రచారమే ప్రధాన ఆయుధం

పీఎన్జీపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలంటే ప్రచారం కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. నగరాలు, పట్టణాల్లో అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తూనే, కంపెనీలు కూడా ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించింది. పైప్‌లైన్ గ్యాస్ ప్రయోజనాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ప్రచార జాతాలు, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. విస్తరణలో ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.

*యువతకు నైపుణ్య శిక్షణ - ఉద్యోగ అవకాశాల దిశగా అడుగులు*

పీఎన్జీ విస్తరణకు అవసరమైన మానవ వనరులను సిద్ధం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, ఇతర నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో చదువుతున్న యువతకు పీఎన్జీ టెక్నికల్ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి పదిహేను రోజులకు ఒకసారి వంద మంది యువతతో బ్యాచ్‌లు ఏర్పాటు చేసి, వారికి వారం రోజుల పాటు ఉచిత వసతి, భోజనం, ఉపకార వేతనం కల్పిస్తూ శిక్షణ ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. గ్యాస్ సంస్థల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు అమలు చేస్తే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

మహిళా సంఘాల ద్వారా ఇంటింటికీ అవగాహన

పీఎన్జీ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను మహిళల ద్వారా కుటుంబాలకు చేరవేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇంట్లో గ్యాస్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండటం, ఖర్చు తగ్గడం, భద్రత మెరుగ్గా ఉండటం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. సెర్ప్, మెప్మా వ్యవస్థలతో పాటు మహిళా సంఘాలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. గ్యాస్ సంస్థలు కూడా మహిళా సంఘాలకు తగిన ప్రోత్సాహం అందించి, వారి సహకారంతో విస్తరణ వేగవంతం చేయాలని సూచించింది.

*అన్నదానం జరిగే ఆలయాల్లో తప్పనిసరిగా పీఎన్జీ*

రాష్ట్రంలో అన్నదానం నిర్వహించే ప్రధాన ఆలయాల్లో పీఎన్జీ వినియోగాన్ని తప్పనిసరి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ఆలయాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నప్పటికీ, మరికొన్ని చోట్ల ఉన్న చిన్నచిన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా పెద్ద దేవాలయాల్లో పీఎన్జీ కనెక్షన్లు వేగంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చింది.

*అద్దెకు ఉండేవారికి సరళ నిబంధనలు*

పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో నివసించే వారికి పీఎన్జీ వినియోగంలో ఇబ్బందులు లేకుండా మార్గదర్శకాలను సరళతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్పీజీకి లభించే రాయితీ తరహాలోనే పీఎన్జీ వినియోగదారులకు కూడా ప్రయోజనాలు అందించేలా చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లు, విల్లాలు, గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో పీఎన్జీ విస్తరణకు కంపెనీలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించింది.

*మరో 15 రోజుల్లో పనితీరుపై మళ్లీ సమీక్ష*

పీఎన్జీ విస్తరణలో స్పష్టమైన పురోగతి కనిపించాలని ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు సూచించింది. రాబోయే పదిహేను రోజుల్లో సంస్థల పనితీరును మరోసారి సమీక్షిస్తామని, విస్తరణలో ఫలితాలు కనిపించేలా చర్యలు ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు ప్రత్యామ్నాయ గ్యాస్ సేవలను వేగంగా చేరవేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu