Anakapalli: రూ.100 కే బైక్ అమ్మబడును.. అనకాపల్లిలో సీపీఐ వినూత్న నిరసన!
Anakapalli: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీపీఐ వినూత్న నిరసన "100 రూపాయలకే బైక్ అమ్మబడును" అంటూ అనకాపల్లిలో ఆందోళన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ అనకాపల్లి పట్టణంలో సీపీఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు నాయకత్వంలో ఫోర్ రోడ్ జంక్షన్ వద్ద భారీ ఆందోళన చేపట్టారు. "100 రూపాయలకే బైక్ అమ్మబడును" అనే వినూత్న నినాదాలతో కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించారు. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారని సీపీఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజన్ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన నాయకులు, ధరల నియంత్రణలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. అనంతరం అనకాపల్లి నాలుగు రోడ్ల కూడలిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగించారు. ప్రజలపై పెరుగుతున్న భారాన్ని తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తామని సీపీఐ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండల కార్యదర్శి వి. రాజు, జిల్లా నాయకులు గొర్లె దేముడు బాబు, కె. త్రినాధ్, ఎం. సత్తిబాబు, కోరిబిల్లి శంకరరావు, సూరిబాబు, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

