Anantapur: అనంతపురంలో పొలిటికల్ హీట్.. ప్రశ్నిస్తే గన్మెన్లను తొలగిస్తారా?
అనంతపురం: రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వంపై, జిల్లా పోలీస్ యంత్రాంగంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే తనను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ఇందులో భాగంగానే జిల్లా పోలీస్ అధికారులు తనకు ఉన్న గన్మెన్లను తొలగించారని ఆయన ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజా పక్షాన పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే గన్మెన్లను తొలగిస్తారా ఇదా మీ ప్రజాస్వామ్యం రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలపై పోలీసులు తక్షణమే దృష్టి పెట్టాలన్నారు.రాష్ట్రంలో మద్యం పాలసీ పూర్తిగా విఫలమైందని తోపుదుర్తి విమర్శించారు. కర్ణాటక, గోవా రాష్ట్రాల నుంచి జిల్లాలోకి భారీగా చీప్ లిక్కర్ వస్తోందని.. ఆ కల్తీ మద్యం తాగి పేద ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.అనంతపురం రూరల్ మండలం, పాపంపేట గ్రామంలో గత యాబై ఏళ్లుగా నివాసం ఉంటున్న స్థానిక ప్రజలను ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
శ్రోత్రియం భూములని చెప్పుకునే యజమానులు ఎప్పుడో తమ హక్కులను కోల్పోయారని.. అక్కడ గలాటలు జరుగుతున్నాయని తెలిసినా కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతపురం జిల్లా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే నాయకులు కొందరే ఉంటారన్న తోపుదుర్తి.. జిల్లా ప్రజల పాలిట దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సత్యసాయిబాబా, ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ మాత్రమే నిజమైన దేవుళ్ళు అని తెలిపారు.

