అనంతపూర్: అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అనంతపురం జిల్లాలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు ఛేదించారు. కళ్యాణదుర్గం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ ముఠాకు చెందిన 10 మంది సభ్యులను అరెస్ట్ చేశారు.
పిలిప్పీన్స్ను కేంద్రంగా చేసుకుని "డ్రీమ్ ప్లే" యాప్ ద్వారా ఆన్లైన్ గేమింగ్ మరియు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో భాగంగా రూ.60 లక్షల విలువైన నగదు, వాహనాలు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
అందులో రూ.19.70 లక్షల నగదు పట్టుబడగా, 9 బ్యాంకులకు చెందిన 49 ఖాతాల్లో ఉన్న రూ.18.20 లక్షలను ఫ్రీజ్ చేశారు. ఫోన్పే లావాదేవీల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తూ, స్థానికుల పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిపించి ఒక్కో ఖాతాకు రూ.10 వేల చెల్లించినట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా కార్గో జీన్స్ ప్యాంట్లలో సిమ్ కార్డులను దాచిపెట్టి పిలిప్పీన్స్కు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన ఈ అంతర్జాతీయ నెట్వర్క్ను ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘాతో గమనించి ఆకస్మిక దాడులు నిర్వహించారు.
రెడ్ హ్యాండెడ్గా నిందితులను పట్టుకున్నారు. ఈ దాడుల్లో 15 మొబైల్ ఫోన్లు, 15 సిమ్ కార్డులు, 13 ATM కార్డులు, ఒక XUV 700 కారు, నాలుగు బైకులు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు కీలక సూత్రధారి శివ ప్రస్తుతం పరారీలో ఉండి, పిలిప్పీన్స్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ... "ఆన్లైన్లో ఆడితే తప్పించుకోలేరు. క్రికెట్ బెట్టింగ్ జోలికెళితే కఠిన చర్యలు తప్పవు" అని హెచ్చరించారు.

