Atmakur: ఆన్ లైన్ ఫార్మసీ విక్రయాలను రద్దు చేయాలి
ఆత్మకూరు: ఫార్మసీ సంస్థలు ఆన్ లైన్ ద్వారా నేరుగా ఔషధాలను విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్లో అన్ని మెడికల్ షాపులను యజమానులు మూసివేశారు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపుమేరకు భారత్ బంద్ ను పాటించారు.
దీంతో ఆత్మకూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లోని పది మండలాల్లో ఔషధ దుకాణాలన్నీ మూతపడ్డాయి. కార్పొరేట్ ఫార్మసీ సంస్థలు గుత్తాధి పద్యంగా అన్ని ఔషధాలను ఆన్లైన్లో విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంత మెడికల్ షాపుల వ్యాపారాలను నిర్వీర్యం చేస్తున్నాయని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ మందుల విక్రయాలను నిలిపివేయాలని ఆత్మకూరు డివిజన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పువ్వాడ భాస్కర్ డిమాండ్ చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులైన నిరుద్యోగులు మెడికల్ షాపులు నిర్వహిస్తూ తాము ఉపాధి పొందుతూ ప్రజలకు సేవ చేస్తున్నారని ఈ ఆన్లైన్ మందుల విక్రయాల వల్ల గ్రామాల్లో వేలాదిమంది మెడికల్ షాపుల నిర్వాహకులు ఉపాధి కోల్పోయి వీధిన పడతారని మెడికల్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ విక్రయాల వల్ల నిషేధిత మత్తు పదార్థాలు, నకిలీ ఔషధాలు విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చి సమాజంలోని యువతను మత్తుకు బానిసలుగా చేస్తున్న అనేక సంఘటనలు ఆత్మకూరు ప్రాంతంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరు గౌడ్ సెంటర్లో నిరసన తెలియజేస్తూ తమ ప్రధాన డిమాండ్లను అమలు చేయాలని లేనిపక్షంలో మెడికల్ షాపులను నిరవధిగా మూసివేయాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నకిలీ ప్రెస్క్రిప్షన్ లతో, భౌతిక పరిశీలన లేకుండా, యాంటీబయాటిక్స్, మత్తుమందులను ఆన్లైన్లో విక్రయించడం వల్ల ప్రజాల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని , ఫార్మసీ ఆన్లైన్ విక్రయాల నిషేధంపై దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో నిషేధ తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపునిచ్చిన భారత్ బంద్ ఆత్మకూరు డివిజన్లో విజయవంతం అయింది.

