Atmakur: స్తంభాలు విరిగినా.. పట్టు వదలని సిబ్బంది!
ఆత్మకూరు నెల్లూరు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలోని చినమాచునూరు సబ్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం గాలులతో కూడిన వర్షం బీభత్సాన్ని సృష్టించి విద్యుత్ శాఖకు అపార నష్టాన్ని కలిగించింది.
చినమాచునూరు సబ్ స్టేషన్ పరిధిలో నాలుగు ఫీడర్లు ఉండగా 14 విద్యుత్ స్తంభాలు విరిగిపోగా ఓ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. సోమవారం సాయంకాలం నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆత్మకూరు విద్యుత్ శాఖ డీఈ బాలు నాయక్, ఏడీ సుధీర్ ఆదేశాల మేరకు మర్రిపాడు విద్యుత్ శాఖ ఏఈ హరికృష్ణ 30 మంది సిబ్బందితో నాలుగు ఫీడర్లలో తలెత్తిన సమస్యను చాకచాక్యంగా పరిష్కరించి సరిచేసి ప్రజలకు మెరుగైన విద్యుత్ సౌకర్యాన్ని అందించారు. దీంతో ప్రజలు, రైతులు, వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తూ ఏఈ హరికృష్ణకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

