Burning Topic: ఫుట్ బాల్ వరల్డ్ కప్కు మాఫియా ముప్పు
Burning Topic: మెక్సికోలో తాజాగా జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్యూబ్లా స్టేట్ తెహ్విట్జింగోలో గుర్తు తెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారు.
మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. హుయిట్జింగో నగరంలోని ఒక నివాస గృహంలో తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఒక మైనర్తో సహా మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక మైనర్ ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ధృవీకరించింది. సాయుధులైన కొందరు దుండగులు ఒక్కసారిగా ఆ ఇంట్లోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తుపాకీ శబ్దాలు విన్న స్థానికులు సమాచారం అందించడంతో మున్సిపల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అయితే ఈ కాల్పుల వెనక ఉన్న కారణం ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కొన్ని రోజుల తర్వాత, ప్యూబ్లా రాజధానిలో ఓ వాహనంపై కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించారు.
ప్రపంచకప్ ప్రారంభానికి కౌంట్డౌన్ మొదలైన తరుణంలో మెక్సికోలో శాంతిభద్రతల పరిస్థితిపై అమెరికాతో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి వ్యక్తమవుతోంది. జూన్ 11 నుండి జూలై 19 వరకు జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నీని అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మెక్సికోలోని మెక్సికో సిటీ, మోంటెర్రే, గ్వాడలజారా నగరాల్లో మొత్తం 13 మ్యాచ్లు జరగనున్నాయి. జూన్ 11న మెక్సికో సిటీలో జరిగే ప్రారంభ మ్యాచ్లో ఆతిథ్య మెక్సికో జట్టు, దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇలాంటి సంయంలో మెక్సికో సిటీకి దాదాపు 208 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెహుయిట్జింగో నగర జనాభా సుమారు 11,300 కాగా, ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ఈ స్థాయి హింస జరగడం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. తాజా ఘటనలో హంతకుల కోసం నేషనల్ గార్డ్, రాష్ట్ర, స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్ బృందాలు సంయుక్తంగా రంగంలోకి గాలిస్తున్నాయి.
ఉత్తర అమెరికా ఖండం దక్షిణ భాగంలో ఉండే దేశం మెక్సికో. ఉత్తరాన అమెరికాతో పాటు గ్వాటెమాల, బెలిజ్ దేశాలు, కరీబియన్ సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. మెక్సికో రాజధాని పేరు మెక్సికో సిటీ. ఇది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరాలలో ఒకటి. మెక్సికో ప్రస్తుతం మాదకద్రవ్యాల ముఠాల హింస, వ్యవస్థీకృత నేరాలు, రాజకీయ అస్థిరత, అవినీతి వంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటోంది. మాదకద్రవ్యాల వ్యాపారం కోసం ముఠాలు మధ్య పోరాటం, వీరిని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ముఠాల పోరాటం కారణంగా హింస నిత్యకృత్యంగా మారిందిఅనేక ప్రాంతాలలో కిడ్నాప్లు, దోపిడీలు, విచక్షణారహిత కాల్పులు సాధారణమయ్యాయి. న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ, ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనం దేశ ఆర్థిక పురోగతికి పెద్ద అవరోధంగా మారాయి. ఈ దేశంతో ప్రభుత్వానికి సమాంతరంగా సాయుధ ముఠాలు పెత్తనం చేస్తున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ కార్టెల్, ప్రపంచ దేశాలను వణికించిన మాఫియా డాన్ ఎల్ మెంచో మెక్సికో మిలిటరీ నిర్వహించిన భారీ సీక్రెట్ ఆపరేషన్లో హతమయ్యాడు. జలిస్కో స్టేల్, తపాల్పా పట్టణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎల్ మెంచో తల మీద 15 మిలియన్ డాలర్ల రివార్డును గతంలోనే ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. ఈ అంతర్జాతీయ నేరస్తుని అంతంతో మెక్సికోలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ నాయకుని మరణ వార్త తెలియడంతో ఎల్ మెంచో అనుచరులు దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసకు పాల్పడ్డారు. పలు చోట్ల రహదారులను దిగ్బంధించారు. ఎక్కడికక్కడ వాహనాలను తగలబెట్టారు. సూపర్ మార్కెట్లు, బ్యాంకులను కూడా వదలకుండా నిప్పంటించారు. ఈ హింసత్మక ఘటనల్లో కనీసం 74 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో 25 మంది నేషనల్ గార్డ్ బలగాలు, 30 మందికి పైగా కార్టెల్ ముఠా సభ్యులు, ఇతర భద్రతా అధికారులు, ఒక పౌరుడు ఉన్నారు.

