Burning Topic: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన దళపతి విజయ్
Burning Topic: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం ఇది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం అనూహ్యంగా దూసుకువచ్చింది.
మళ్లీ అధికారం మాదే ధీమాతో ఉన్న అధికార డీఎంకే చతికిలపడింది. రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. తమిళనాడులో సినిమాలకు రాజకీయాలకు ఉన్న సంబంధం కొత్తేమీ కాదు. గతంలో కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలిత రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎందరో సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చిన సక్సెస్ కాలేకపోయారు. కానీ విజయ్ టీవీకే మాత్రం ప్రజల నాడిని పట్టుకోవడంలో సక్సెస్ అయ్యానని నిరూపించుకున్నారు. దాదాపు అన్ని సర్వేలూ డీఎంకేనే అధికారంలోకి వస్తుందని అంచనా వేసినా యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం టీవీకే ప్రభంజనం సృష్టిస్తుందని, ఏకంగా అధికారం దక్కించుకుంటుందని చెప్పింది. విజయ్ 'మరో ఎంజీఆర్' అవుతారని చెప్పింది. ఇప్పుడు అదే నిజమైంది.
తమిళగ వేట్రి కళగం సాధించిన విజయం ఐదు దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను.. వాటి కూటముల్ని వెనక్కి నెట్టేసింది. కేవలం రెండేళ్ల పసికూన లాంటి టీవీకే రెండు పార్టీలను వానప్రస్థానికి పంపినట్లయింది. వాస్తవానికి ఈ రెండు కూటములు టీవీకేను కలుపుకొని వెళ్లడానికి ప్రయత్నించాయి. అయితే తాను ఏ పార్టీ జెండా మోయబోమని.. సింహం సింగిల్గానే పోటీ చేస్తుందని ప్రకటించారు విజయ్. 2026 ఎన్నికల్లో అధికార సాధనే లక్ష్యమని ముందే ప్రకటించారు. జట్టుగా వచ్చే పార్టీలకు అధికారంలో వాటా సైతం ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చారాయన. ఆయన చేసిన ప్రకటనలు రాజకీయ విశ్లేషకులకు ఆశ్చర్యపరిచాయి. రెండేళ్లలో అధికారం సాధించడం సాధ్యమయ్యే పని కాదని భావించారు. ఇప్పుడు వచ్చిన ఫలితాలను చూసి ఈ రెండు పార్టీలు విలవిలాడుతున్నాయి. తమదే అధికారం అని భావించిన డీఎంకేకు మాస్టర్ మాస్టర్ స్ట్రోక్ తగిలింది. విజయోత్సవాల కోసం ఏర్పాటు చేసిన టెంట్లను ఎత్తేశారు.
గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న డీఎంకే పాలనలో పెరిగిపోయిన అవినీతిపై తమిళ ప్రజల విముఖత స్పష్టంగా బయటపడింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టడం, కుటుంబ సభ్యుల పెత్తనంపై విపక్షాలు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపాయి. ఆయన హిందూ మతానికి, ముఖ్యంగా వ్యతిరేకంగా మాట్లాడటంతో డీఎంకే యాంటీ హిందూ పార్టీ అనే ముద్ర పడింది. ముఖ్యమంత్రి ద్రవిడార్ నమూనాతో పేరుతో ఉత్తర భారతీయ వ్యతిరేకతను బాహటంగా చాటుకున్న డీఎంకేకు పెద్ద ఎదురు దెబ్బే తగిలించి. మునుపెన్నడూ లేని రీతిలో ద్రవిడ సిద్ధాంతాన్ని తిరస్కరించిన తమిళ ఓటర్లు విజయ్ పార్టీ టీవీకే ఇచ్చిన 'మార్పు' అనే నినాదానికి పట్టం కట్టారు. ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే మూడో స్థానానికి పడిపోగా, అన్నా డీఎంకే రెండో స్థానంలో నిలిచింది.
తమిళనాడు యువతతో హీరో విజయ్కు మొదటి నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది. 2024 ఫిబ్రవరి 2న టీవీకేను ప్రారంభించడం ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తనకు రాజకీయాలంటే కేవలం మరో వృత్తి కాదు. ప్రజలకు సేవ చేసే పవిత్రమైన పని ఇది. రాజకీయాలు నాకు హాబీ కాదు. నా తపన' అంటూ ప్రజల మనసులో నాటుకుపోయే ప్రారంభ ప్రసంగంలోనే ప్రకటించారు. అదే రోజున తాను ఇక సినిమాల్లోంచి తప్పుకుంటానని చెప్పారు. తన చివరి సినిమా జననాయగన్ అని, ఆ తర్వాత పూర్తి జీవితం రాజకీయాలకే అంకితమనిని స్పష్టం చేశారు. యువత నాడిని పట్టుకోవడంలో విజయ సక్సెస్ అయ్యారంటున్నారు విశ్లేషకులు. ఆయన చివరి సినిమా 'జననాయగన్' విడుదలకు సెన్సార్ ఇబ్బందులు రాజకీయంగా వివాదానికి దారితీసింది. దీనిపై స్పందించిన విజయ్.. ప్రత్యర్థులపై పదునైన విమర్శలకు బదులు.. తన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆయన ముందుకెళ్లారు.
నిజానికి విజయ్ రాజకీయాల్లోకి వస్తారని తమిళనాట చాలా కాలంగా ప్రచారం జరిగింది. 2009లో తన అభిమాన సంఘాలను ఒక వేదికపైకి తెచ్చి విజయ్ మక్కల్ ఇయక్కమ్ -వీఎంఐ పేరుతో సంక్షేమ సంఘంగా మార్చారు. 'వీఎంఐ'.. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమికి 'వీఎంఐ' మద్దతిచ్చింది. 2020లో ఈ 'వీఎంఐ'ని విజయ్ తండ్రి ఆల్ ఇండియా తళపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్ పేరుతో రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేయించారు. అయితే, విజయ్ దీన్ని బహిరంగంగానే తోసిపుచ్చారు. కొంతకాలం దీనిపై న్యాయపోరాటం చేసిన తర్వాత.. ఆ పార్టీ రద్దయ్యింది. అయితే విజయ్ అభిమానులు తమిళనాడు స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి 115 చోట్ల విజయం సాధించింది. రాజకీయాల్లోకి రాకముందు నుంచే.. విజయ్ సామాజిక అంశాలపై గళమెత్తారు. శ్రీలంక తమిళులకు మద్దతుగా నాగపట్టిణం మత్య్సకారులను కలవడం 2011లో చర్చనీయాంశమైంది. 2017లో 'నీట్' వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నారు
అయితే విజయ్ రాజకీయ పయనం వివాదాలతో మొదలైంది. గత సంవత్సరం సెప్టెంబరులో కరూర్లో జరిగిన ర్యాలీలో తొక్కిసలాటలో 41మంది మృతి చెందడం ఆయన పార్టీకి మచ్చలా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. ఆ సమయంలో విజయ్పై ఆమె చేసిన ఆరోపణలు, నటి త్రిషతో ఉన్న సంబంధంఎన్నికల సమయంలో ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారాయి. అయితే విజయ్ ఇవేవీ పట్టించుకోకుండా కేవలం పార్టీని ముందుకు తీసుకెళ్లడం మీదే దృష్టి నిలిపారు. విమర్శలు, ఒత్తిళ్లు తాను చూసుకుంటానని.. మీరు గెలుపు మీదే దృష్టి సారించాలని పార్టీ శ్రేణులను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు. విజయ్ పార్టీ విజయంలో మహిళలు, యువతదే ప్రధాన పాత్ర అని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వర్గాలను ఆకట్టుకునే విధంగా ప్రకటించిన మ్యానిఫెస్టో విజయ్కి కలిసొచ్చింది. యువత కోసం విద్యా రుణాలు, మహిళలకు ఆర్థిక సాయం, అమ్మాయిలకు పెళ్లి కానుకలాంటి హామీలు కలిసొచ్చాయి.

