Chegunta: వడ్ల కొనుగోలు కేంద్రంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తనిఖీలు!
చేగుంట: దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలంలోని బోనాల కొండాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వడ్లు అమ్మడానికి తీసుకువచ్చిన రైతులు లారీల కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. లారీల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు రైతులకు భరోసా కల్పిస్తూ,లారీలను వెంటనే పంపించేలా చర్యలు తీసుకుంటాను అని హామీ ఇచ్చారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే లారీలను ఏర్పాటు చేయాలని, రైతులు ఇబ్బందులు పడకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.లారీల పంపిణీలో ఎలాంటి ఆలస్యం చేయొద్దని అధికారులను హెచ్చరించిన ఎమ్మెల్యే గారు, రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా చేయాలన్నారు.

