Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Cylinder Prices  : మళ్లీ పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు.. సామాన్యుడికి  మరో ఊహించని షాక్

Cylinder Prices : మళ్లీ పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు.. సామాన్యుడికి మరో ఊహించని షాక్

hmtv 3 days ago

Cylinder Prices

Cylinder Prices

Cylinder Prices : ఇప్పుడిప్పుడే గ్యాస్ ధరలు కాస్త స్థిరపడుతున్నాయని ఉపశమనం పొందుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చేలా ముందడుగు వేస్తోంది.

దేశంలో గ్యాస్ వినియోగదారులపై అదనపు రుసుములు వసూలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేశీయంగా ఇంధన భద్రతను పటిష్టం చేయడంలో భాగంగా డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్‌పై ప్రతి కిలోకు రూ.1.29 మేర అదనపు సుంకం వసూలు చేయాలని యోచిస్తోంది. ఈ నిర్ణయం కనుక అమల్లోకి వస్తే గృహావసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి.

ఎంత పెరిగే అవకాశం ఉందంటే?

ఈ కొత్త ప్రణాళిక ప్రకారం ప్రతి గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌పై కిలోకు రూ.1.29 ఛార్జీ విధించాలని కేంద్రం ఆలోచిస్తోంది. దీనివల్ల సాధారణంగా వాడే 14.2 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర సుమారుగా రూ.18 వరకు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా.. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) పై కూడా ప్రతి క్యూబిక్ మీటరుకు రూ.1.43 మేర సుంకాన్ని విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అదనపు ఛార్జీల విధింపు వల్ల దేశవ్యాప్తంగా గ్యాస్ బిల్లులు సగటున 2 శాతం మేర పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అదనపు వసూళ్లతో ప్రభుత్వానికి భారీ ఆదాయం

ప్రభుత్వం భావిస్తున్న ఈ కొత్త రుసుముల ద్వారా భారీ ఎత్తున నిధులు సమకూరనున్నాయి. ఎల్పీజీపై విధించే సుంకం ద్వారా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.4,375 కోట్ల ఆదాయం లభించనుండగా, సీఎన్జీపై విధించే సుంకం ద్వారా మరో రూ.9,500 కోట్ల వరకు లభిస్తుంది. ఈ రెండు మార్గాల ద్వారా కేంద్రానికి ఏటా దాదాపు 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.13,800 కోట్లు) సమకూరతాయని అంచనా వేస్తున్నారు. ఈ సొమ్మును దేశంలో అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జి (LNG) నిల్వ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి వెచ్చిస్తారు.

ఇంధన నిల్వల కోసం రూ.4 లక్షల కోట్ల మాస్టర్ ప్లాన్

అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య చోటుచేసుకుంటున్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాకు తరచూ అంతరాయం కలుగుతోంది. ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో దేశంలో గ్యాస్ కొరత రాకుండా చూసేందుకు కేంద్రం రాబోయే 10 సంవత్సరాలలో భారీ ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జి నిల్వలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం దాదాపు 42 బిలియన్ డాలర్లు (సుమారు రూ.4 లక్షల కోట్లు) ఖర్చవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నిధులలో సగానికి పైగా మొత్తాన్ని నిల్వ కేంద్రాల నిర్మాణానికి, మిగిలిన మొత్తాన్ని ఇంధనాన్ని ముందస్తుగా కొనుగోలు చేసి దాచడానికి ఉపయోగిస్తారు.

అమల్లోకి ఎప్పుడు వస్తుంది?

ఈ అదనపు రుసుముల విధింపు ప్రతిపాదన ప్రస్తుతం వివిధ మంత్రిత్వ శాఖల మధ్య అంతర్గత చర్చల దశలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి ఇంకా తుది ఆమోదం లభించలేదు. వివిధ శాఖల సమగ్ర చర్చల అనంతరం ఈ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ముందు ఉంచనున్నారు. కేబినెట్ ఆమోద ముద్ర వేసిన తర్వాతే ఈ నిర్ణయం అధికారికంగా అమల్లోకి రానుంది. ఒకవేళ ఆమోదం లభిస్తే రాబోయే రోజుల్లో సామాన్యుల వంటగ్యాస్ బిల్లులపై పెనుభారం పడటం ఖాయంగా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu