Gangadhara: గంగాధరలో రైల్వే గేటు మొరాయింపు.. నిలిచిపోయిన అంబులెన్స్!
గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మంగపేట శివారులో శుక్రవారం ఉదయం రైల్వే గేటు సాంకేతిక లోపం కారణంగా తెరుచుకోకపోవడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
గేటు మూసివేసి ఉండటంతో రెండు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదే సమయంలో జగిత్యాల నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న ఒక అంబులెన్స్ కూడా ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో రోగి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అత్యవసర సేవలకు ఆటంకం కలగడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గేటులో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని గుర్తించి మరమ్మతులు చేపట్టారు. గేటును పునరుద్ధరించే వరకు కొంత సమయం పట్టడంతో ట్రాఫిక్ మరింతగా పెరిగింది. అనంతరం గేటును సరిచేసి తెరవడంతో వాహనాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు శాశ్వత చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

