గుర్ల: మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్.ఎస్.ఆర్ పేట గ్రామానికి చెందిన స్థానిక ఎంపీటీసీతో పాటు సుమారు 40 కుటుంబాలు వైసీపీని వీడి గురువారం తెలుగుదేశం పార్టీలో చేరాయి.
గుర్ల మండల టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు సమక్షంలో ఎంపీటీసీ, ఆయన అనుచరులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ ప్రెసిడెంట్ శివరాములు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
రామ్ మల్లిక్ నాయుడు వ్యాఖ్యలు:
ఈ సందర్భంగా రామ్ మల్లిక్ నాయుడు మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు జోడు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు జరుగుతున్న మేలును, ఎన్నికల మేనిఫెస్టోలోని 'సూపర్ సిక్స్' పథకాలను చూసి ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీడీపీలోకి వస్తున్నారు" అని అన్నారు.
"కొత్తగా పార్టీలో చేరిన నాయకులను మా కుటుంబ సభ్యులుగా భావిస్తాం. రానున్న మూడేళ్లలో ఎస్.ఎస్.ఆర్ పేట గ్రామంలో పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి సహకారంతో పరిష్కరిస్తాం. పాత, కొత్త నాయకులను సమన్వయం చేసుకుంటూ గుర్ల మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచుతాం" అని రామ్ మల్లిక్ నాయుడు తెలిపారు.

