Hyderabad: నాగోల్ పోలీసులకు రాఖీ కట్టిన 'సహచరి' మహిళా బృందం!
Hyderabad: రక్షాబంధన్ సందర్భంగా నాగోల్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మహిళా సంఘాలతో కలిసి ఏర్పాటు చేసిన 'సహచరి' బృందం సభ్యులు పోలీసులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు.
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని నాగోల్ బ్లైండ్స్ కాలనీలోనాగోల్ ఇన్స్పెక్టర్ మగ్బుల్ జానీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అడిషనల్ డీసీపీ రామేశ్వర్ సహచరీల నుంచి రాఖీ కట్టించుకున్నారు.
సమాజ భద్రతలో సహచరీల కీలక పాత్ర
మల్కాజిగిరి సీపీ బి.సుమతి, ఐపీఎస్ చొరవతో మూడు నెలల క్రితం మహిళా సంఘాల సభ్యులతో 'సహచరి' బృందాన్ని ఏర్పాటు చేశారు. సమాజంలో జరుగుతున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పాటు.. ప్రజల్లో భద్రతపై అవగాహన కల్పించడంలో ఈ బృందం కీలకంగా పనిచేస్తోంది.
రక్షాబంధన్ సందర్భంగా "మీకు మేము రక్ష.. మనం సమాజానికి రక్ష" అనే సందేశంతో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, సహచరి బృందం సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు పోలీసులు కానుకలు అందజేశారు.

