Hyderabad: నోట్లు లెక్కించడానికి కౌంటింగ్ మెషీన్లు తెచ్చిన అధికారులు
హైదరాబాద్: జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీ కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే మల్లాపూర్ లోని ఆయన నివాసం లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయన నివాసం తో పాటు ఆయన కుటుంబసభ్యుల ఇండ్లలో మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
మల్లాపూర్లోని కుమార్ ఇంట్లో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో భారీగా నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలు చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ నగదు లెక్కింపునకు కౌంటింగ్ మెషీన్లను అధికారులు వినియోగిస్తున్నారు. దాదాపు (కోటి పదిలక్షల రూపాయలు)రూ.1.10 కోట్ల నగదు,1.5 కిలోల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.
నిజామాబాద్లో 3 ఎకరాల వ్యవసాయ భూమి తో హైదరాబాద్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో మూడు ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లను అధికారులు గుర్తించారు. బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసి మరిన్ని ఆస్తులను గుర్తించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. మల్లాపూర్లోని కుమార్ నివాసంలో 2 కార్లను సీజ్ చేశారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.

