Karimnagar: జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు..కలెక్టర్ చిత్రా మిశ్రా!
Karimnagar: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, జిల్లాలోనూ వర్షాలు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు.
ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. పాత, శిథిలావస్థలో ఉన్న భవనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైన చోట్ల జేసీబీలు, రెస్క్యూ వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు.
వదులుగా ఉన్న విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను ఏఈలతో సమన్వయం చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 8782997247ను ప్రజలకు, ప్రజాప్రతినిధులకు విస్తృతంగా తెలియజేయాలి. ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే ఈ నంబర్కు సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వైద్యాధికారులు, డిప్యూటీ డీఎంహెచ్వోతో సమన్వయం చేసుకుని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, సీజనల్ వ్యాధులకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, అత్యవసర వైద్య సేవలను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. రహదారులకు జరిగిన నష్టంపై పంచాయతీరాజ్ అధికారులు వెంటనే నివేదిక అందించాలని తెలిపారు. ఆర్అండ్బీ రహదారులు, కల్వర్టులు, వంతెనలు ఇతర మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టంపై రోడ్లు భవనాల శాఖ అధికారులు నివేదిక సమర్పించాలని అన్నారు.
పంట నష్టాలను నమోదు చేయాలని, అలాగే పశుసంవర్థక శాఖ సిబ్బందితో కలిసి అవసరమైన చోట పశువుల రక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించారు.
వర్షం కారణంగా ప్రమాదకరంగా పారుతున్న నీటి కాలువల వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని, నీటి ప్రవాహానికి సంబంధించిన ప్రమాదకర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు
మండల స్థాయి అధికారులు ఎవరూ ముందస్తు అనుమతి లేకుండా సెలవులో వెళ్ళరాదని, అందరూ తప్పనిసరిగా వారు పని చేస్తున్న హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

