Karimnagar: మొక్కజొన్న కొయ్యలను పొలాల్లో కాల్చొద్దు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
కరీంనగర్: వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ లో అఖిల భారత మొక్కజొన్న పరిశోధన కేంద్రం మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా గిరిజన కులాల ఉపప్రణాళికలో భాగంగా మొక్కజొన్న సాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై శిక్షణా కార్యక్రమయు నిర్వహించారు.
అనంతరం గిరిజన కులాల ప్రణాళికలో భాగంగా వ్యవసాయ ఉత్పాదకాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా. ఈ. ఉమారాణి ముందుగా ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం తెలిపారు. మొక్కజొన్న సాగులో మేలైన పద్ధతులు అవలంబించి రైతులు లాభాలు పొందచ్చని తెలిపారు.
ప్రధాన శాస్త్రవేత్త మరియు వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ అధిపతి డా. బి.రాంప్రసాద్ పరిశోధన స్థానంలో లో జరుగుతున్న పరిశోధనల గురించి మొక్కజొన్న లో వచ్చే ఇతర చీడ పీడలు వాటి యాజమాన్యం గురించి వివరించారు. కరీంనగర్ లో ఉన్న మొక్కజొన్న పరిశోధన కేంద్రంలో అనేక రకాలైన మొక్కజొన్న వంగడాలపై పరిశోధనలు జరుగుతున్నాయని మేలైన మొక్కజొన్న రకాలను నాటి అధిక లాభాలు పొందచ్చన్నారు. తెలంగాణకే తలమానికమైన మొక్కజొన్న పరిశోధన కేంద్రం కరీంనగర్ లో ఉండడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు.
డా. ఇ.రజినీకాంత్, సీనియర్ శాస్త్రవేత్త మాట్లాడుతూ వానాకాలం మొక్కజొన్నసాగు లో మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కలిగించారు. డా. G. ఉషారాణి, శాస్త్రవేత్త మాట్లాడుతూ రైతులు పంట వ్యర్థాలు కాల్చి మొక్కజొన్న విత్తనోత్పత్తి గురించి వివరించారు. మొక్కజొన్న కొయ్యలను పొలాలలో కాల్చకూడదని వాటి వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని రైతులు గమనించాలన్నారు.
డా. బి హరిక్రిష్ణ, TRVK కరీంనగర్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ పంటల వైవిధ్యకరణ గురించి తెలియజేస్తూ పంట మార్పిడి యొక్క ఆవశ్యకత వివరించారు. కరీంనగర్ జిల్లాలో మొక్కజొన్న పరిశోధన కేంద్రం ఉండడం ఇక్కడి రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మొక్కజొన్న లో వివిధ రకాల వంగడాలను సృష్టించి రైతులకు మేలైన వంగడాలను అందించి వారి ఉత్పత్తిలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త Dr. M. మదన్ మోహన్ రెడ్డి మొక్కజొన్నలో విలువ ఆధారిత ఉత్త్పత్తుల మరియు డిజిటల్ వ్యవసాయం పైన అవగాహన కల్పించారు. మొక్కజొన్న రైతులు వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు పాటించి అధిక లాభాలు పొందాలని సూచించారు.
కార్యక్రమ అనంతరం కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎర్రబెల్లి గ్రామానికి చెందిన 52 మంది గిరిజన కులాల రైతులకు, సింగిల్ సీడర్ ( చేతితో విత్తే విత్తన పరికరం) పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థాన AEO నర్సింహులు, శ్రీనివాస్, శ్రీకాంత్ మరియు వంశీ కృష్ణ మరియు అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

