Kurnool: గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్
కర్నూలు : గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.
సిరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాల మెరుగుదల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్" కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, సంబంధిత అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా కర్నూలు జిల్లాలో మూడు మండలాలకు చెందిన ఏడు గ్రామాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. మంత్రాలయం మండలంలోని పరమాన్ దొడ్డి, హోలగుంద మండలంలోని నెరణికి తండా, కోగిలతోట, మద్దికెర మండలంలోని పెరవలి, మద్దికెర, బసినేపల్లి గ్రామాలు ఎంపికయ్యాయని, ఈ గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా పలు పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) ద్వారా గృహాల నిర్మాణం, గృహ విద్యుదీకరణ, ఆఫ్-గ్రిడ్ సౌర విద్యుత్ పథకాలు, జాతీయ ఆరోగ్య మిషన్, వ్యవసాయాభివృద్ధికి సంబంధించిన MoAFW పథకాలు, అటవీ హక్కుల చట్టం (FRA) కింద పట్టాలు పొందిన వారికి స్థిరమైన వ్యవసాయ ప్రోత్సాహం కల్పించేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా రహదారుల అభివృద్ధి, జాతీయ సికిల్ సెల్ మిషన్ ద్వారా సికిల్ సెల్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు, సామర్థ్య కేంద్రాల ఏర్పాటు, అంగన్వాడీ కేంద్రాల బలోపేతం, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ద్వారా వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. ఇంకా సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా విద్యా అభివృద్ధి, టెలికం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా డిజిటల్ కనెక్టివిటీ, స్కిల్ ఇండియా మిషన్ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు కల్పించి ఉపాధి అవకాశాలను పెంపొందిం చాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి సాధించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎంపికైన గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ చిరంజీవి, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

