Kurnool: కర్నూలులో మెడికల్ షాపుల బంద్.. రోడ్లపైకి వచ్చిన కెమిస్టులు!
కర్నూలు: ఆన్ లైన్ ద్వారా మందులను విక్రయించరాదని అఖిలభారత కెమిస్టుల సమాఖ్య పిలుపుమేరకు కర్నూలు నగరంలో మెడికల్ షాపులు బంద్ చేసి మెడికల్ షాప్ యజమానులు నిరసన తెలిపారు.దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా కర్నూలు లో మెడికల్ షాపులన్నీ ఒకరోజు బంద్ చేశామని నాయకులు తెలిపారు.అఖిల భారత కెమిస్టుల సమాఖ్య ఆధ్వర్యంలో మెడికల్ షాప్ యజమానులు స్టేడియం నుంచి ఎస్బిఐ సర్కిల్ మీదుగా ఆర్ఎస్ రోడ్ సర్కిల్ వరకు ర్యాలీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్ లైన్ విధానంలో మందులు సప్లై చేయడం వల్ల మెడికల్ షాపు యజమానులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ షాప్ ని నమ్ముకుని కోట్ల సంఖ్యలో ఉన్నారని వారంతా జీవనోపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు.ఆన్ లైన్ విధానంలో నకిలీ మందులు సైతం విక్రయిస్తున్నారని దీనితో పాటు యువత డ్రగ్స్ కు అలవాటు పడే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.
వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత కెమిస్టుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు యాడికి పుల్లయ్య,శ్రీధర్,విజయభాస్కర్,అఖిల భారత కెమిస్టుల సమాఖ్య నాయకులు పాల్గొన్నారు.

