Kurnool: పెద్ద కోత లేకుండానే ప్లీహాన్ని తొలగించారు కర్నూలు వైద్యుల ఘనత
కర్నూలు: ఆదోని ప్రాంతంలోని నాగల దిన్నె గ్రామానికి చెందిన 20 సంవత్సరాల యువతి శ్రవంతి, గత 20 రోజులుగా ఎడమ పై పొత్తికడుపు భాగంలో నొప్పితో బాధపడుతూ కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి శస్త్రచికిత్స విభాగాన్ని ఆశ్రయించింది.
వైద్యుల పరిశీలనలో అల్ట్రాసౌండ్ పరీక్షలో ప్లీహ పై భాగంలో సుమారు 13×14×13 సెం.మీ పరిమాణంలో పెద్ద సిస్టు గుర్తించబడింది. అనంతరం సీ.ఈ.సీ.టి పరీక్ష ద్వారా నిర్ధారించబడింది.
వైద్య బృందం ఆమెకు లాపరోస్కోపిక్ స్ప్లీనెక్టమీ (ప్లీహ తొలగింపు శస్త్రచికిత్స) చేయాలని నిర్ణయించి, 30-04-2026న విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించింది. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ లాపరోస్కోపిక్ స్ప్లీనెక్టమీ విజయవంతంగా పూర్తయిందని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్యం స్థిరంగా ఉండి, ఎలాంటి శస్త్రానంతర సమస్యలు లేకుండా కోలుకుంది.
ఈ శస్త్రచికిత్సను యూనిట్-2 చీఫ్ డాక్టర్ ఆర్. రామకృష్ణ నాయక్ , అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సబీరా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ప్రణీత్, డాక్టర్ ప్రశాంతి కలిసి విజయవంతంగా నిర్వహించారు. అనస్థీషియా విభాగం హెచ్ఓడీ & ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్, ప్రొఫెసర్ డాక్టర్ రామశివ నాయక్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణలత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శివ కుమార్ కూడా ఈ చికిత్సలో కీలక పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు, మరియు శస్త్రచికిత్స విభాగం అధిపతి డాక్టర్ పి. హరిచరణ్ గారు శస్త్రచికిత్స బృందాన్ని అభినందించారు. వైద్యులు మరియు పీజీ విద్యార్థుల సమిష్టి కృషితో ఈ యువతికి విజయవంతమైన శస్త్రచికిత్స చేయడం సాధ్యమైందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

