Malyala: జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో చేరిన రాంపూర్ సర్పంచ్ బద్దం సంధ్య
మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ బద్దం సంధ్య - తిరుపతిరెడ్డి, ఉప సర్పంచ్ దున్నపోతుల మహేష్తో పాటు గ్రామ వార్డు సభ్యులు మరియు సుమారు 30 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గంగాధరలోని ప్రజా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. గ్రామాభివృద్ధి, రైతు సంక్షేమం, యువత ఉపాధి వంటి అంశాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ గ్రామాల ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. రాంపూర్ గ్రామ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

