Mandamarri: సింగరేణికి పూర్వ వైభవం తెస్తాం మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ
మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రి డివిజన్ KK-5 గనిని కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సందర్శించారు.
గని కార్మికులతో కలిసి స్వయంగా గని లోపలికి దిగిన మంత్రి, అక్కడి పని పరిస్థితులను పరిశీలించి కార్మికులతో ముచ్చటించారు. గనిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, భద్రతా ఏర్పాట్లు, పని విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు పేర్క్ ఇన్కమ్ ట్యాక్స్, సొంతింటి సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థను నిర్లక్ష్యం చేశారని, కొత్త గనులు ప్రారంభించలేదని విమర్శించారు. ప్రజా పాలన ప్రభుత్వం సింగరేణికి పూర్వ వైభవం తీసుకురావడంపై దృష్టి పెట్టిందన్నారు. కొత్త గనులు, కొత్త ఉద్యోగాల ద్వారా కార్మికులకు న్యాయం చేస్తామని తెలిపారు. కార్మికులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పించి భద్రతతో కూడిన వాతావరణంలో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు. KK-5 గనికి లభించిన హైయెస్ట్ ప్రొడక్టివిటీ, సేఫ్టీ అవార్డులు ఆనందకరమని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.

