Medical Negligence
Medical NegligenceMedical Negligence : ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ జిల్లాలో వైద్యలోకం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లే యమపాశాలుగా మారారు.
ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ ఆపరేషన్ చేసిన వైద్య బృందం, నిర్లక్ష్యంతో మహిళ కడుపులో ఏకంగా సర్జికల్ స్పాంజ్ (మెడికల్ దూది) వదిలేశారు. దీనివల్ల ఆ మహిళ ప్రాణాలు పోయే పరిస్థితి రాగా, ఆసుపత్రి యాజమాన్యం మాత్రం అసలు విషయం దాచిపెట్టి డబ్బుల కోసం ఆమెను మరిన్ని రోజులు మోసం చేసింది.
అసలు ఏం జరిగిందంటే?
బలరాంపూర్ జిల్లాలోని మెడివే అనే ప్రైవేట్ ఆసుపత్రిలో అంజూ దేవి అనే గర్భిణీకి ప్రసవం కోసం ఆపరేషన్ చేశారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆపరేషన్ జరిగిన కొన్ని రోజుల నుంచే అంజూ దేవికి కడుపులో తీవ్రమైన నొప్పి రావడం, ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. బాధతో ఆసుపత్రికి వెళ్తే, అక్కడి డాక్టర్లు ప్రతిభా యాదవ్, సంతోష్ యాదవ్, ఆసుపత్రి నిర్వాహకుడు బి.డి.కౌటియల్ అసలు విషయం చెప్పకుండా, ఏదో ఇన్ఫెక్షన్ అని నమ్మిస్తూ ఆమె వద్ద నుంచి వేల రూపాయలు వసూలు చేస్తూ కాలక్షేపం చేశారు.
బహ్రైచ్ తనిఖీల్లో బయటపడ్డ అసలు నిజం
నొప్పి తగ్గకపోవడంతో అంజూ దేవి కుటుంబ సభ్యులు ఆమెను బహ్రైచ్ జిల్లాలోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్ చేసిన వైద్యులు షాక్కు గురయ్యారు. ఆపరేషన్ చేసిన సమయంలో బలరాంపూర్ డాక్టర్లు ఆమె కడుపులో సర్జికల్ స్పాంజ్ వదిలేసినట్లు తేలింది. ఆ దూది లోపలే ఉండటంతో ఆమె పేగులు కుళ్లిపోవడం ప్రారంభమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన వైద్యులు ఆమెకు రెండుసార్లు ఆపరేషన్ చేసి ఆ దూదిని తొలగించి ప్రాణాలు కాపాడారు.
నిర్వాహకులపై కేసు నమోదు - విస్తుపోయే విషయాలు
ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఆరోగ్య శాఖ విచారణ చేపట్టింది. విచారణలో ఆసుపత్రి నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా తేలింది. ముఖ్యంగా డాక్టర్ ప్రతిభా యాదవ్కు అసలు అల్లోపతి వైద్యం చేసేందుకు కావాల్సిన సరైన డిగ్రీ లేదని, ఆమె దొంగ డాక్టర్గా చలామణి అవుతోందని అధికారులు గుర్తించారు. ఆసుపత్రిని నిర్వహిస్తున్న కౌటియల్, డాక్టర్ ప్రతిభ, సంతోష్ యాదవ్లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్ మేధావి సింగ్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వైద్యారోగ్య శాఖ హెచ్చరిక
నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. డిగ్రీలు లేకుండా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి క్వాక్ డాక్టర్లను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రస్తుతం అంజూ దేవి పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, ఒక చిన్న నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునే ప్రమాదం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

