Nara Lokesh: ఉపాధి కల్పన మా బ్రాండ్.. గొడ్డలి జగన్ బ్రాండ్
Nara Lokesh: రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి 'రతనాల సీమ'గా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
కడప జిల్లా టి.కోడూరు వద్ద భారీ సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు గొట్టిపాటి రవికుమార్ (ఇంధన శాఖ), సవిత (చేనేత, జౌళి శాఖ) లతో కలిసి నారా లోకేశ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్లాంట్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారా లోకేశ్ మాట్లాడుతూ.. కేవలం 11 నెలల రికార్డు కాలంలోనే ఈ సోలార్ ప్రాజెక్టును సాధించడం వెనుక స్థానిక రైతుల భూత్యాగం ఉందన్నారు. "ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తోంది. ఉమ్మడి కడప జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన అనేది కేవలం నారా చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుంది. ఉపాధి కల్పన మా బ్రాండ్ అయితే.. గొడ్డలి రాజకీయం జగన్ మోహన్ రెడ్డి బ్రాండ్" అంటూ లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందని లోకేశ్ వెల్లడించారు. రాష్ట్రంలో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను భారీ ఎకనమిక్ రీజియన్లుగా (Economic Regions) అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతి రీజియన్కు ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం 'రాయల్ ఎన్ఫీల్డ్'తో పాటు రక్షణ రంగానికి చెందిన 'ఫైటర్ జెట్' తయారీ కంపెనీలు వస్తున్నాయని ఆయన కీలక విషయాలు వెల్లడించారు.
గత వైసీపీ పాలకుల వేధింపుల వల్ల అనేక కంపెనీలు రాష్ట్రం వదిలి పారిపోయాయని.. కానీ తాము 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' (Speed of Doing Business) విధానాన్ని అమలు చేసి పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని నింపామని లోకేశ్ పేర్కొన్నారు. విధ్వంసం చేయడం నిమిషం పని అని, వ్యవస్థలను నిర్మించడం ఎంతో కష్టంతో కూడుకున్న వ్యవహారమని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే వేదికపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో త్వరలోనే విద్యుత్ ఛార్జీలు తగ్గించే దిశగా తమ శాఖ గట్టిగా కృషి చేస్తోందని ప్రజలకు హామీ ఇచ్చారు.

