OD Cheruvu: ఓ.డి చెరువులో నరకప్రాయంగా ప్రయాణం గుంతలమయమైన కదిరి రోడ్డు!
ఓ.డి చెరువు: కేంద్రంలో రహదారులు పూర్తిగా గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా కదిరి - హిందూపురం ప్రధాన రహదారిపై అడుగడుగునా భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు నిత్యం ప్రాణాలను పణంగా పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి వడ్డీ వారిపల్లి వరకు రహదారి దారుణంగా దెబ్బతినడంతో తరచూ చిన్నపాటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు గుంతల్లో జారి పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు.
రహదారి దుస్థితి కారణంగా ఓడి చెరువులోకి రావాల్సిన ఆర్టీసీ బస్సులు కూడా బైపాస్ మార్గంలో వెళ్లిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, విద్యార్థులు, మహిళలు బస్సుల కోసం దూరంగా నడవాల్సి వస్తోందని పేర్కొన్నారు.
అదేవిధంగా చిన్నపాటి వర్షం పడినా రహదారిపై నీరు నిలిచిపోవడంతో గుంతలు కనిపించకుండా పోతున్నాయి. దీంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారులను మరమ్మతు చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

