Dailyhunt
Off The Record: జగన్ అడ్డాలో లోకేష్ మాస్టర్ ప్లాన్!

Off The Record: జగన్ అడ్డాలో లోకేష్ మాస్టర్ ప్లాన్!

hmtv 1 week ago

Off The Record: జగన్ అడ్డాలో లోకేష్ మాస్టర్ ప్లాన్!

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్ విభజన జరగనున్న నేపథ్యంలో రాయలసీమపై టీడీపీ ప్రత్యేక దృష్టి సారించిందట.

టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ టీం ఇప్పటికే సీమలో పెరగనున్న సీట్లపై ఫోకస్ పెట్టిందట. ప్రత్యర్థి పార్టీలకు కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు అవసరమైన ఎత్తులు వేస్తున్నారట. గత ఎన్నికల్లో సీమలో సాధించిన పట్టును భవిష్యత్తులో నిలుపుకోవడానికి ఇప్పటి నుంచి సన్నాహాలు మొదలు పెట్టారట. సీమ గడ్డపై పట్టు కోసం టీడీపీ చేస్తున్న కసరత్తు ఎలా ఉంది? భవిష్యత్తుపై ఆ పార్టీ ధీమా ఏంటి? వాచ్ దిస్ HMTV ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.

ఏపీలో వచ్చే ఎన్నికల్లోపు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే అధికార పార్టీ కొత్తగా ఏర్పడనున్న నియోజకవర్గాలపై దృష్టి సారించిందట. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ఇబ్బంది లేకుండా నియోజకవర్గాల విభజనతోపాటు మండలాలు, పల్లెల్లో పక్కా సర్వే కొనసాగిస్తున్నారట. టీడీపీ జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ టీం ఇప్పటికే రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించిందన్న చర్చ జరుగుతోంది. తొలిసారి రాయలసీమలో పార్టీని పెద్ద ఎత్తున ఆదిరంచిన ఓటర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి పార్టీ పరంగా, ప్రభుత్వ ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనాలు చేకూర్చి, భవిష్యత్తులో ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలని పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోందట. రాయలసీమను భవిష్యత్తులో టీడీపీ కంచుకోటగా తీర్చిదిద్దేందుకు పక్కా కార్యాచరణతో ముందుకు వెళుతున్నారట.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏపీలో కొలువుతీరింది. మొత్తం 175 స్థానాలకు 164 చోట్ల విజయం సాధించి రికార్డు సృష్టించారు. ప్రత్యర్థి వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ముందు నుంచీ కాంగ్రెస్‌కు ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమలోనూ టీడీపీ ఊ‎హించని రీతిలో మెజారిటీ సాధించింది. సీమలో మొత్తం 52 స్థానాలకు 45 చోట్ల కూటమి అభ్యర్థులు విజయ ఢంకా మోగించి సరికొత్త రికార్డు సృష్టించారు. సీమ గడ్డపై వైసీపీ.. కేవలం ఏడు సీట్లకే పరిమితం అయింది. గత ఎన్నికల్లో కూటమిని ఆదరించిన రాయలసీమ ప్రజల ప్రయోజనాలు నెరవేర్చడంతోపాటు ప్రత్యర్థి పార్టీ నేతలకు బలమైన స్థానాలుగా ఉన్న వాటిని ఏ విధంగా విభజించాలి అన్న విషయంపై కసరత్తు జరుగుతోందట.

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న కడప జిల్లా పులివెందుల సహా ఆ పార్టీకి ముందు నుంచీ కీలకంగా ఉన్న స్థానాలను పునర్ విభజనలో తమకు అనుకూలంగా మలుచుకునేందుకు చర్యలు చేపడుతున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణ సహా పలువురు తెలుగుదేశం పార్టీ ఉద్ధండులు రాయలసీమ నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈక్రమంలో సీమలోని కొన్ని నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటగా ఉన్నాయి. నియోజకవర్గాల పునర్ విభజనతో రాయలసీమలో అసెంబ్లీ స్థానాలు 52 నుంచి 78కి పెరిగే అవకాశం ఉందట. ఉమ్మడి అనంతపుం జిల్లాలో ఐదు నుంచి ఆరు స్థానాలు కొత్తగా ఏర్పడనున్నాయన్న చర్చ జరుగుతోంది. చిత్తూరు జిల్లాలో ఏడు స్థానాలు, తిరుపతిలో మూడు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐదు సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కడప, అన్నమయ్య జిల్లాల్లో నాలుగు లేదా ఐదు స్థానాలు పెరిగే అవకావం ఉందట. ఈ అంచనాలే నిజమైతే వచ్చే ఎన్నికలనాటికి రాలయసీమలో మొత్తం 78 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

గత ఎన్నికల్లో విజయం సాధించిన విధంగానే వచ్చే 2029 నాటి ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను టీడీపీ లేదా కూటమి పార్టీలు దక్కించుకోవాలని అధికార కూటమి భావిస్తోందట. అందుకోసం ఇప్పటి నుంచే నారా లోకేష్ టీం ప్రత్యేక కసరత్తు చేస్తోందట. నియోజకవర్గాల బాధ్యులు, ఎమ్మెల్యేల పనితీరును నిశితంగా పరిశీలిస్తున్న టీడీపీ అధిష్టానం కొత్తవారి కోసం అన్వేషణ చేపట్టిందట. గతంలో పార్టీకి పనిచేసి, ప్రస్తుతం తటస్థంగా ఎన్నికలకు దూరంగా ఉన్న వారిని వచ్చే ఎన్నికలకు సన్నద్ధం చేయాలిన నిర్ణయించారట. ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలిగిన వారిని గుర్తించే పనిలో ఉన్నారట. వివాదాస్పదంగా మారిన ఎమ్మెల్యేలు, పనితీరు బాగాలేక చెడ్డపేరు మూటగట్టుకున్న ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి సమర్థులు, మంచి పేరు ఉన్న వారిని బరిలో దించే యోచనలో పార్టీ ఉందట. గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు కట్టబెట్టిన సీమ ప్రజలకు ప్రత్యేక పథకాలు, ప్రాజెక్టుల ద్వారా మేలు చేయడంతోపాటు సమర్థవంతమైన నాయకుల కోసం ఇప్పటి నుంచే వేట ప్రారంభిచారట.

కొత్త నియోజకవర్గాలుగా ఏర్పాటు కానున్నాయన్న మండలాలు, మున్సిపాలిటీలకు సంబంధించిన నేతలు కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం వద్దకు క్యూ కడుతున్నారట. తమ బలాబలాలను అధినేతకు వివరిస్తూ కొత్తగా ఏర్పడే నియోజకవర్గంలో అవకావం ఇవ్వాలని కోరుతున్నారట. పార్టీ నేతల అభ్యర్థనలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఓపికగా వింటున్నా.. ఎలాంటి భరోసా ఇవ్వడం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్లకుపైగా సమయం ఉండడంతోపాటు పార్టీకి చెందిన పలు టీంలు ఈపాటికే సర్వే నిర్వహిస్తన్నాయట. నియోజకవర్గాల పునర్ విభజనతో రాయలసీమలో తెలుగుదేశం పార్టీ మరింత పటిష్టంగా మారడానికి ఆ పార్టీ నేతలు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారట. నియోజకవర్గాల పునర్ విభజనలో అధికార కూటమి పాత్ర ఏవిధంగా ఉండబోతోందో.. ముఖ్యంగా పార్టీ యువనాయకుడు నారా లోకే‎ష్ ఏవిధమైన నిర్ణయాలు తీసుకోనున్నారో..? చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu