Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Palakonda: పాలకొండలో వైఎస్సార్‌సీపీ భారీ ఇంధన నిరసన ర్యాలీ

Palakonda: పాలకొండలో వైఎస్సార్‌సీపీ భారీ ఇంధన నిరసన ర్యాలీ

hmtv 6 days ago

Palakonda: పాలకొండలో వైఎస్సార్‌సీపీ భారీ ఇంధన నిరసన ర్యాలీ

Palakonda: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైస్సార్సీపీ అధినేత శ్రీ వై.యస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెట్రోలు,డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు శ్రీ పాలవలస విక్రాంత్ గారు, మాజీ శాసనసభ్యులు శ్రీమతి విశ్వాసరాయి కళావతి గారి ఆధ్వర్యంలో పాలకొండ పట్టణంలోని ఆర్.టీ.సీ కాంప్లెక్స్ నుంచి పాలకొండ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

అనంతరం పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయ అధికారి కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెట్రో ధరలు ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికం, చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వంలో పెట్రో ధరల మంట. రాష్ట్రంపై పెట్రో భారం రూ.3,391 కోట్లు.

చంద్రబాబు గారి ప్రభుత్వం మరో 'బాదుడే బాదుడు' మొదలుపెట్టింది. సూపర్‌సిక్స్‌ తరహాలో మరో మోసంతో పచ్చి దగా చేస్తోంది. అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి, అన్నింటిలాగే ఆ విషయాన్ని కూడా గాలికొదిలేసింది. ఒకవైపు సంక్షేమ,అభివృద్ధి పథకాలు,కార్యక్రమాలు లేవు. గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన అన్ని పథకాలు రద్దు చేయడమే కాకుండా,ఇప్పుడు ఈ తరహా పెట్రో బాదుడే బాదుడుతో వాహనదారులతో పాటు, ప్రజల నడ్డి విరుస్తోంది.

తాజా పెంపుతో రాష్ట్రంలో లీటరు పెట్రోల్‌ రూ.113.62, లీటర్‌ డీజిల్‌ రూ.101.24కు చేరింది. రాష్ట్రంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) ఎక్కువగా ఉండటంతో,దేశం మొత్తం మీద ఇక్కడే పెట్రోల్,డీజిల్‌ ధరలు అత్యధికంగా ఉన్నాయి. పెరిగిన ధరల వల్ల పెట్రోల్‌పై రోజూ రూ.3.29 కోట్లు, డీజిల్‌పై రూ.6 కోట్లు అధిక భారం రాష్ట్రంలో వాహనదారులపై పడుతుంది. అలా రాష్ట్ర ప్రజలపై నెలవారీ పెట్రోల్‌పై రూ.98.7 కోట్లు, డీజిల్‌పై రూ.180 కోట్ల చొప్పున భారం పడనుంది.

ఆ మేరకు ఏడాదికి పెట్రోల్‌పై రూ.1,201 కోట్లు, డీజిల్‌పై రూ.2,190 కోట్ల చొప్పున మొత్తంగా రూ.3,391 కోట్ల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రజలు భరించాల్సి ఉంటుంది. ఏపీలో పెట్రోల్,డీజిల్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయని, వాటిపై రాష్ట్రం వేసే పన్నే అందుకు కారణం అని, టీడీపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్‌పై వేసిన పన్నును తగ్గిస్తామని దానివల్ల రాష్ట్రంలో అన్ని ధరలు తగ్గుతాయి అని ఎన్నికల ముందు చంద్రబాబు గారు, నారా లోకేష్‌ గారు ఊదరగొట్టారు.

ఇంకా ప్రజలను నమ్మించేందుకు మ్యానిఫెస్టోలో కూడా పెట్టి,ఇప్పుడు మాట తప్పారు. ఇప్పుడు పన్ను తగ్గింపుల ఊసే ఎత్తడం లేదు. ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రజలంతా పొదుపు పాటించేలా అవగాహన కల్పించాలి.పెట్రోల్, డీజిల్‌ ఆదా చేయాలి.తక్కువ దూరాలకు సైకిళ్లను వినియోగించాలి.కార్‌ పూలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలి.ఎలక్ట్రిక్‌ వాహనాలు వాడాలి. వారంలో ఒకరోజు నో వెహికల్‌ డే గా పాటించాలి అని చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. ఇదీ చంద్రబాబు గారి రెండు నాల్కల ధోరణి.

మన రాష్ట్రంలో అత్యధికంగా లీటర్‌ పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్‌తో పాటు రూ.4 ఇంకా.. మరో ఒక్క రూపాయి రోడ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌గా వసూలు చేస్తున్నారు. అదే విధంగా లీటర్‌ డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్‌తో పాటు రూ.4 ఇంకా.. మరో రూపాయి రోడ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ కింద వసూలు చేస్తున్నారు. అధికారంలోకి రాగానే, అవన్నీ తగ్గిస్తామని నాడు హామీ ఇచ్చిన చంద్రబాబు గారు ఆయన కుమారుడు నారా లోకేష్ గారు,ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు.

అందుకని ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి. ఈ విషయంలో అంతా కలిసి రావాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు గారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా,ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్, ఇతర బాదుడు తగ్గించి, ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నాం.

ఈ ర్యాలీలో పాలకొండ నియోజకవర్గంకు సంబందించిన నాలుగు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ ఉపాధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మాజీ కౌన్సిలర్లు,ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ, వార్డు స్థాయిలో ఉన్న పార్టీ అనుభంద విభాగ కమిటీ అధ్యక్షులు, పార్టీ కమిటీ సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu