Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం గొర్లివలస గ్రామ సమీప అటవీ ప్రాంతంలో అరుదైన కందజాతికి చెందిన పువ్వులు దర్శనమిస్తున్నాయి.
కొండ అంచుల్లో సహజసిద్ధంగా పెరిగిన ఈ భారీ ఆకారంలోని పువ్వులు స్థానిక రైతులు, గిరిజనులను ఆకర్షిస్తున్నాయి.
ఈ పువ్వులను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఇవి అరుదైన కందజాతికి చెందిన ఎలిఫెంట్ ఫుట్ యమ్ (Elephant Foot Yam) వర్గానికి చెందినవిగా భావిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా అడవి ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ మొక్క ఔషధ గుణాలతో ప్రసిద్ధి చెందింది.
శాస్త్రవేత్తల ప్రకారం ఈ దుంపలో అధిక మినరల్స్, పోషకాలు ఉండటంతో శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో, లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, పైల్స్ వంటి సమస్యలను నియంత్రించడంలో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
అలాగే ఈ కందజాతి పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో, ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృతంగా సాగు చేస్తే గిరిజన రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు గిరిజన రైతులకు అవగాహన కల్పించి, విత్తనాలు మరియు సాగు సహాయం అందిస్తే ఈ అరుదైన ఔషధ పంట భవిష్యత్తులో మంచి ఆదాయ వనరుగా మారుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

