Parvathipuram: పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ సరికొత్త ఆదర్శాన్ని చాటారు. ఇంధన పొదుపు కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన తన బంగ్లా నుండి కలెక్టరేట్ వరకు సైకిల్పై ప్రయాణించి, అధికారుల్లో స్ఫూర్తిని నింపారు.
కలెక్టరేట్లో నిర్వహించే పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కలెక్టర్ ఈ విధంగా సైకిల్పై రావడం అందరినీ ఆకట్టుకుంది.
పర్యావరణహిత జీవనశైలిని ప్రోత్సహించడంలో భాగంగా కలెక్టర్ స్వయంగా సైకిల్ తొక్కుతూ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం కలెక్టరేట్ హాల్లో ఏర్పాటు చేసిన పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమంలో పాల్గొని, అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం, ఇంధనాన్ని పొదుపు చేయడం మనందరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వీలైనంత వరకు కాలుష్య రహిత రవాణా మార్గాలను ఎంచుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

