Harish Rao: బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే 'ఫ్యూచర్ సిటీ' రద్దు.. ఫార్మా సిటీని రీస్టోర్ చేస్తాం
Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన 'ఫ్యూచర్ సిటీ' (Future City) ప్రాజెక్టుపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్యూచర్ సిటీని పూర్తిగా రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన 'ఫార్మా సిటీ' (Pharma City) ప్రాజెక్టును మళ్లీ యథాతథంగా పునరుద్ధరిస్తామని (Restore) ప్రకటించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీ విషయంలో డబుల్ గేమ్ ఆడుతోందని హరీశ్రావు విమర్శించారు. "ఫార్మా సిటీని కొనసాగిస్తామని ఓ వైపు న్యాయస్థానానికి (కోర్టుకు) చెబుతూ.. మరోవైపు బయట మాత్రం జిమ్మిక్కులు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. అసలు కేంద్ర పర్యావరణ శాఖ అన్ని రకాల అనుమతులు ఇచ్చింది కేవలం 'ఫార్మా సిటీ'కి మాత్రమే. నిబంధనల ప్రకారం ల్యాండ్ యూజ్ మార్చడం లేదా డీవియేషన్ (ప్రాజెక్ట్ మార్చడం) ఉంటే.. సేకరించిన రైతుల భూములను తిరిగి వారికే ఇచ్చేయాలని చట్టంలో స్పష్టంగా ఉంది" అని హరీశ్రావు గుర్తుచేశారు.
ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డ హరీశ్రావు.. రేవంత్ సర్కార్ ఫ్యూచర్ సిటీ పేరుతో అక్కడ పక్కాగా 'రియల్ ఎస్టేట్ వ్యాపారం' చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఫ్యూచర్ సిటీని రద్దు చేసి, పరిశ్రమల స్థాపన కోసం ఉద్దేశించిన ఒరిజినల్ ఫార్మా సిటీ ప్రాజెక్టును మళ్లీ తెరపైకి తెస్తామని, రైతులకు న్యాయం చేస్తామని హరీశ్రావు స్పష్టం చేశారు.

