Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Proddatur: పంచ్ ప్రభాకర్ పై ఆర్యవైశ్యుల ఆగ్రహం.. అరెస్ట్ చేయాలని డిమాండ్!

Proddatur: పంచ్ ప్రభాకర్ పై ఆర్యవైశ్యుల ఆగ్రహం.. అరెస్ట్ చేయాలని డిమాండ్!

hmtv 3 weeks ago

Proddatur: పంచ్ ప్రభాకర్ పై ఆర్యవైశ్యుల ఆగ్రహం.. అరెస్ట్ చేయాలని డిమాండ్!

Proddatur: ఆర్యవైశ్య సమాజాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన యాక్టివిస్టు పంచ్ ప్రభాకర్‌పై ప్రభుత్వం వెంటనే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ నాయకులు డిమాండ్ చేశారు.

స్థానిక అమ్మవారి శాలలో ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుశెట్టి రామ్మోహన్ మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యక్తులు కులాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి ద్వేషపూరిత ప్రచారాలపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరిలో మార్పు కనిపించడం లేదని విమర్శించారు. ముఖ్యంగా పంచ్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఆర్యవైశ్య సమాజం శతాబ్దాలుగా వ్యాపార, సేవా రంగాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించుకుని సమాజ సేవలో ఎప్పుడూ ముందుంటుందని నాయకులు గుర్తు చేశారు. అన్నదాన కార్యక్రమాలు, విద్యార్థులకు ఆర్థిక సహాయం, వైద్య సేవలు, పేదల వివాహాలు, సామూహిక కళ్యాణ కార్యక్రమాలు వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందని తెలిపారు. అలాంటి సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేయడం అసహనానికి గురిచేస్తోందన్నారు.

ఆర్యవైశ్య ప్రముఖుడు టీజీ వెంకటేశ్వర్లు మరియు ఆయన కుటుంబ సభ్యులపై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేయడం మరింత బాధాకరమని నాయకులు పేర్కొన్నారు. టీజీ వెంకటేశ్వర్లు కులమతాలకు అతీతంగా సామూహిక వివాహాలు నిర్వహిస్తూ అనేక పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. సమాజ సేవలో నిమగ్నమైన వ్యక్తులపై వ్యక్తిగత విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు.

రాజకీయ విమర్శలు వేరు, కుల సంఘాలను కించపరచడం వేరు అని స్పష్టం చేసిన నాయకులు, ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో అనవసర ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని సూచించారు. వ్యక్తిగత అభిప్రాయాల పేరుతో సమాజాల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలను ప్రభుత్వం కఠినంగా అరికట్టాలని కోరారు.

పంచ్ ప్రభాకర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘాలు కలిసి ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. త్వరలోనే ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదు అందజేస్తామని తెలిపారు. అవసరమైతే పరువు నష్టం దావాలు కూడా దాఖలు చేస్తామని స్పష్టం చేశారు.

ఆర్యవైశ్య సభ నాయకులు సీవీ సురేష్, నాగేశ్వరరావు మాట్లాడుతూ విదేశాల్లో ఉంటూ సామాజిక వర్గాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వెనుక మరికొందరి ప్రోత్సాహం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఆర్యవైశ్య సంఘాలు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నాయని తెలిపారు.

ఈ సమావేశంలో ఆర్యవైశ్య సభ జాయింట్ సెక్రటరీ మల్లెంకొండు ప్రతాప్, సభ్యులు జొన్నలగడ్డ రామచంద్ర ప్రకాష్, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu