Raghav Chadha: రాఘవ్ చద్దాపై వేటు.. కావాలనే నోరు నొక్కేశారా.? అసలేం జరిగింది.?
Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభలో తన పార్టీ నాయకత్వంలో ఊహించని మార్పులు చేశారు.
పార్టీలో కీలక నేతగా, కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రాఘవ్ చద్దాను రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో పంజాబ్ ఎంపీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్ మిట్టల్ను నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.
చద్దా ప్రాధాన్యత తగ్గుతోందా?
పార్టీ ఆవిర్భావం నుంచి కేజ్రీవాల్ వెన్నంటే ఉన్న 37 ఏళ్ల రాఘవ్ చద్దాకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన చద్దా, 23 ఏళ్ల వయసులోనే 'ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్' ఉద్యమంలో చేరారు. ఢిల్లీ లోక్పాల్ బిల్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఆయన, 2022లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే, గత కొంతకాలంగా పార్టీ కీలక కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా కనిపించకపోవడం, కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు కోర్టుల నుంచి ఊరట లభించినప్పుడు పెద్దగా స్పందించకపోవడం వంటివి పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గిందనే ఊహాగానాలకు బలాన్నిస్తున్నాయి.
కొత్త బాధ్యతల్లో అశోక్ మిట్టల్
రాజ్యసభలో సంజయ్ సింగ్ పార్టీ లీడర్గా కొనసాగుతుండగా, ఇప్పుడు అశోక్ మిట్టల్ ఆయనకు సహాయకుడిగా (డిప్యూటీ లీడర్) వ్యవహరిస్తారు. ఈ నియామకంపై మిట్టల్ స్పందిస్తూ, "మాది ప్రజాస్వామ్య పార్టీ. అందరికీ అవకాశం ఇస్తుంది. గతంలో ఎన్డీ గుప్తా, ఆ తర్వాత చద్దా జీ ఈ పదవిలో ఉన్నారు, ఇప్పుడు నాకు ఆ అవకాశం లభించింది" అని కేజ్రీవాల్కు కృతజ్ఞతలు తెలిపారు.
రాజ్యసభలో ఆప్ బలం
ప్రస్తుతం రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి 10 మంది సభ్యులు (పంజాబ్ నుంచి 7, ఢిల్లీ నుంచి 3) ఉన్నారు. బిజెపి, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తర్వాత సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా ఆప్ కొనసాగుతోంది.
పార్టీ పరంగా చద్దాకు జరిగిన ఈ 'డెమోషన్' వెనుక అసలు కారణాలను ఆప్ అధికారికంగా వెల్లడించలేదు. అయితే విమానాశ్రయాల్లో ఆహార ధరలు, గిగ్ వర్కర్ల హక్కులు వంటి ప్రజా సమస్యలపై చద్దా రాజ్యసభలో గళమెత్తుతూనే ఉన్నారు. తాజా మార్పులు ఆప్ అంతర్గత రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.

