Razole: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మత్స్యకార సేవలో పథకం 2026-27 కార్యక్రమంలో భాగంగా రాజోలు నియోజకవర్గ పరిధిలోని 2,284 మంది మత్స్యకారులకు రూ.4,56,80,000ల వేట నిషేధ భృతి పంపిణీ కార్యక్రమం కరవాక గ్రామంలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..,వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20,000 చొప్పున భృతి అందించడం అభినందనీయమన్నారు. గతంలో ఈ భృతి రూ.10,000గా ఉండేదని, ప్రస్తుతం ప్రభుత్వం దానిని రెట్టింపు చేసి రూ.20,000 లకు పెంచడం ద్వారా మత్స్యకారుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటిందన్నారు.
రాజోలు నియోజకవర్గంలో మొత్తం 2,284 మంది మత్స్యకారులకు ఈ భృతి అందుతున్నట్లు తెలిపారు. ఒకే ఇంటిలో నివసిస్తూ హౌస్ మ్యాపింగ్ చేయించుకున్న రెండు కుటుంబాలలో ఒక కుటుంబానికి మాత్రమే భృతి మంజూరవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అటువంటి సమస్యలను వెంటనే పరిశీలించి అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా, ఇంకా రిజిస్ట్రేషన్ పొందని కొన్ని చేపల వేట బోట్లకు త్వరితగతిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అగ్నికుల క్షత్రియ మత్స్యకార కుటుంబాలకు అందవలసిన అన్ని సంక్షేమ పథకాలు పారదర్శకంగా, సమర్థవంతంగా అమలయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, మత్స్యశాఖ అధికారులు, మత్స్యకార సంఘాల నాయకులు, లబ్ధిదారులు మరియు పలువురు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

